నటుడు శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన... రంగారెడ్డి డీఈవోకి కీలక ఆదేశాలు...
హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యంపై నటుడు శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) స్పందించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓను ఆదేశించింది. ఆ నివేదికను బట్టి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
స్కూల్ ఫీజులు పెంచి తల్లిదండ్రులను వేధించడమే గాక... దానిపై ప్రశ్నించినందుకు తమ పిల్లలను ఆన్లైన్ క్లాసుల నుంచి బ్లాక్ చేసినట్లు శివబాలాజీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్ఆర్సీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. శివ బాలాజీ ఫిర్యాదు చేసిన రోజే పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ ఫీజుల పెంపుపై నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన 46జీవో ప్రకార కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా... ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఇతర ఫీజులు కూడా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.
శివ బాలాజీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడంతో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై రెండు రోజుల క్రితం శివ బాలాజీ భార్య మధు మాట్లాడుతూ... మౌంట్ లిటేరాలో చదువుతున్నవిద్యార్థుల తల్లితండ్రులంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అందులో తానూ ఒక సభ్యురాలినని చెప్పారు. అధిక స్కూల్ ఫీజులపై వాట్సాప్ గ్రూపులో విద్యార్థుల తల్లిదండ్రులందరం చర్చించామని... దానిపై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడే బాధ్యతను తాను తీసుకున్నానని చెప్పారు.
అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం అందరు విద్యార్థుల తల్లిదండ్రుల తరుపున మీరెలా మాట్లాడుతారని... ఏదైనా మాట్లాడితే మీ వ్యక్తిగతంగా మాట్లాడాలని తనతో చెప్పినట్లు మధు తెలిపారు. అప్పటినుంచి తమ పిల్లల ఆన్లైన్ క్లాసుల ఐడీలను బ్లాక్ చేసినట్లు చెప్పారు.ఇది ఒకరకంగా విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేయడమేనని ఆరోపించారు. ఇప్పుడీ వ్యవహారం హెచ్ఆర్సీ పరిధిలో ఉండటంతో... విచారణలో ఏం తేలుతుందో వేచి చూడాలి.