వంద, రెండొందలు లంచం కాదు: రాజయ్య భాష్యం
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మంచిర్యాల ఏరియా ఆసుపత్రిలో రాత్రి బస చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం టి.రాజయ్య పరోక్షంగా వైద్యులకు మద్దతు పలికారు. బుధవారం ఆస్పత్రి నుంచి వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చే పేషంట్ల నుంచి ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు డబ్బులు తీసుకోవడం తప్పుకాదని అన్నారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
"పేషంట్ల నుంచి ఆసుపత్రి సిబ్బంది రూ. 100, రూ. 200లు తీసుకుంటే అతి తప్పేం కాదు. దయచేసి దానిని లంచంగా చూడకండి" అని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది బాగా ఇబ్బంది పెడితే ఆర్డీవో, డీఎంహెచ్వో, కలెక్టర్కు ఫోన్లో సమాచారమివ్వాలని సూచించారు.
నిన్నటి వరకు స్వైన్ఫ్లూ బారిన పడి ఐదుగురు మరణించినట్లు చెప్పిన ఆయన స్వైన్ఫ్లూ మరణాలు లేవని తాజాగా మాట మార్చారు. స్వైన్ఫ్లూ బాధిత రోగులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఓ ఐసోలేటెడ్ వార్డుతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘థర్మోస్కాన్'ను ఏర్పా టు చేసినట్లు తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే డీఎంహెచ్వోల ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఇచ్చిన వెంటనే అన్ని జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఖాలీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు.