కట్టుకున్న వాడే కాలయముడు: భార్యను ఉరివేసి హతమార్చిన భర్త
భార్య స్వాతితో గొడవపడ్డ వేణు చీర కొంగుతో ఆమె మెడకు ఉరివేసి హతమార్చాడు.
వరంగల్ : కడదాక తోడుంటానని..ఏడడుగులు వేసి..మూడు మళ్ల బంధంతో.. వేద మంత్రాల మధ్య అగ్నిసాక్షిగా మనువాడిన భర్తే.. తన పాలిట యముడవుతాడని ఆ ఇల్లాలు ఊహించలేదు.
పలుమార్లు గొడవలు జరిగినా.. అనేక రకాలుగా వేధింపులకు గురిచేసినా.. ఏ రోజుకైనా మారకపోతాడా.. అనే చిన్న ఆశతో అన్నింటికి రాజీపడి అతడితో కాపురం చేసినా.. ఆ మృగాడు మారకపోగా.. ఆమె నమ్మకాన్ని వమ్ము చేస్తూ చీర కొంగుతో ఉరి వేసి హతమారుస్తాడని ఆ ఇల్లాలు ఊహించలేక పోయింది. చివరకు భార్యనే కడతేర్చిన సంఘటన నర్సంపేట పట్టణంలో శుక్రవారం సంచలనం రేపింది.
ఇందుకు సంబంధించి మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. నర్సంపేట మండలం ఇటికాలపల్లికి చెందిన ముత్తోజుట రామచారి రెండో కుమారుడు వేణుకు, వరంగల్ నగరం కరీమాబాద్ నివాసి చెలగిల్లి నారాయణ కుమార్తె స్వాతితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. పదో తరగతి చదివిన వేణు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో వేద కళాశాలలో చేరి పౌరోహిత్యంలో ప్రావీణ్యం సాధించాడు.
అక్కడి నుంచి తిరిగొచ్చి స్వగ్రామమైన ఇటికాలపల్లిలో పౌరోహిత్యం పనుల మీద చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి శుభకార్యాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మృతురాలి స్వాతి కుటుంబానికి అతడి భర్త వేణు తండ్రి రామాచారి కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటంతో వివాహం చేశారు. వివాహేతర సంబంధాలతో వేణు కట్టుకున్న భార్య స్వాతిని నిరంతరం వేధిస్తుండటంతో పలుమార్లు వాగ్వాదం జరిగింది.
ఐతే పెద్దలు కల్పించుకొని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ నేపధ్యంలో వేణు తన భార్యను స్వాతిని తీసుకొని ఇటికాలపల్లి నుంచి రెండేళ్ల క్రితం నర్సంపేట పట్టణానికి వచ్చి మల్లంపల్లి రోడ్డులో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. మళ్లీ దంపతుల మధ్య వివాదాలు నెలకొన్నాయి.
ఈ నేపధ్యంలో శుక్రవారం రాత్రి దంపతులిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వేణు భార్య స్వాతిని ఆమె చీర కొంగుతో మెడకు ఉరివేసి హతమార్చాడు. వెనుక గదిలో నుంచి స్వాతి మృతదేహాన్ని తీసుకొచ్చి ముందు గదిలో ఉంచాడు. ఇటికాలపల్లిలోని తన బాబాయి కుమారుడికి శుక్రవారం వేకువజామున ఫోన్ చేసి తన భార్య చనిపోయిందని చెప్పాడు. వారు వచ్చే సరికి వేణు ఇంటి నుంచి పరారై తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
బోరున విలపించిన తల్లిదండ్రులు
తమ కుమార్తె మృతి చెందిందనే సమాచారం తెలుసుకున్న పుట్టింటి వారు నర్సంపేటకు చేరుకున్నారు. మృతదేహంపై బోరున విలపించారు. స్వాతి కష్టాలను, ఆమె చెప్పిన విషయాలను, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గుండెలవిసేలా విలపించారు. తమ కుమార్తె కడతేర్చిన భర్త, అత్తింటి వారిని తీసుకొచ్చే దాకా తాము మృతదేహాన్ని తరలించబోమని భీష్మించారు.
సీఐ దేవేందర్రెడ్డి, ఎస్సై హరికృష్ణలు వారిని సముదాయించి శాంతింపజేశారు. పోస్టుమార్టంకు తరలించి స్వాతి మృతదేహాన్ని పుట్టింటివారికి అప్పగించారు. అదనపు కట్నం కోసం వేధించారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారి ఫిర్యాదు మేరకు భర్త వేణుతో పాటు అత్తమామ, బావ, తోడికోడలు, ఆడబిడ్డలపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవేందర్రెడ్డి వివరించారు.