క్షుద్రపూజ: భార్యని 30వేలకు అమ్మకానికి పెట్టిన భర్త, లారీ బీభత్సం
హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేసే అతనికి.. ఓ వ్యక్తి తన భార్యను రూ.30వేలకు అమ్మకానికి పెట్టాడు. దీంతో, స్థానికులు అతనిని చితకబాదారు.
సుధాకర్ మంత్రగాడు క్షుద్రపూజలు నిర్వహిస్తుంటాడు. అతనికి తన పూజల కోసం ఓ మహిళ కావాల్సి వచ్చింది. అతను గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు చేసే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది.
దీంతో, యూకూబ్ అనే వ్యక్తి క్షుద్రపూజలు నిర్వహించే సుధాకర్కు తన భార్యను అమ్మకానికి పెట్టాడు. దీనిని గుర్తించిన గ్రామస్థులు, బంధువులు మంత్రగాడిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. యూకూబ్ పరారీలో ఉన్నాడు.
ప్రియురాలిని ఎత్తుకుపోయిన దుండగులు
ప్రేమికుడిని బెదిరించి దాడి చేసి ప్రియురాలిని ద్విచక్ర వాహనం మీద అపహరించుకుపోతుండగా స్థానికులు వెంబడించి దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలో సోమవారం చోటుచేసుకుంది.
సిద్దిపేట కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న పదిహేడేళ్ల విద్యార్థిని తన ప్రియునితో కలిసి వెళ్తున్నారు. వీరిని గమనించిన నలుగురు దుండగులు ప్రియుడిని బెదిరించి దాడిచేసి ఫోన్ తీసుకొని విద్యార్థినిని బైక్ మీద ఎక్కించుకొని వెళ్లారు.
ఈ క్రమంలో ప్రియుడు రోడ్డు మీదికి వచ్చి జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వెంటనే వారిని వెంబడించగా దుండగులు వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో ఒక నిందితుడు స్థానికులకు పట్టుబడగా అతనిని పోలీసులకు అప్పగించి విద్యార్థినిని రక్షించారు. పరారైన మిగతా ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాదులో లారీ బీభత్సం
హైదరాబాద్లో సోమవారం అర్థరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. పోలీస్ చెక్పోస్ట్ పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గోల్కొండ ప్రాంతంలోని రాందేవ్గూడ వద్ద గణేష్ ఉత్సవాలు, బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసులు గుడారం ఏర్పాటు చేసి తాత్కాలిక చెక్పోస్టు నిర్వహిస్తున్నారు.
అర్థరాత్రి సమయంలో మితి మీరిన వేగంతో వచ్చిన లారీ చెక్పోస్టు మీదికి దూసుకొచ్చి నలుగురు కానిస్టేబుళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న గోల్కొండ పోలీస్ ఠాణా కానిస్టేబుల్ రాహుల్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రశాంత్, సైదులు, పవన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరిని చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి, మరొకరిని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో పలు బైక్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.