హుజురాబాద్ లో ఉపఎన్నిక ప్రచారం పీక్స్ కి ; అసలు పరీక్ష ఓటర్ల సహనానికే .. ఎందుకంటే !!
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్ కు చేరటంతో ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడటంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూకుడును కొనసాగిస్తున్నారు. ఈసారి హుజురాబాద్ ఉప ఎన్నిక అటు అధికార టిఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఒక్కో ఓటరు పైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు రాజకీయ పార్టీల నాయకులు. దాదాపు ఐదు నెలల కాలంగా హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుందని అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు నియోజకవర్గం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుండే ప్రచార పర్వాన్ని సాగిస్తూనే ఉన్నారు.
ఓటర్లకు ఊపిరాడనివ్వకుండా రాజకీయ పార్టీల ప్రచారం
ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రచారం పీక్స్ కు చేరుకుంది. ఓటర్లను ఊపిరాడనివ్వకుండా రాజకీయ పార్టీల నాయకులు చంపుతున్నారు. మా పార్టీకి అంటే మా పార్టీకి ఓటేయండి అంటూ రచ్చ చేస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ నుండి గుంపులుగుంపులుగా ప్రచారాన్ని సాగిస్తున్న నేతలు ఒక్కో ఓటరు దగ్గర పది నిమిషాల సమయాన్ని కేటాయించి తమకు ఓటు ఎందుకు వేయాలో, ప్రత్యర్థి పార్టీకి ఎందుకు వేయకూడదు సవివరంగా చెబుతున్నారు. ఇక ఒక పార్టీ నేతలు వెళ్లిన వెంటనే, ఇంకొక పార్టీ నేతలు ఓటర్ల పై దాడి చేస్తున్నారు. అంతేనా పొద్దున లేస్తే ఫోన్ కాల్స్ ద్వారా తమకు ఓటేయాలని అభ్యర్థుల అభ్యర్థనలు, ఆపై వాట్సాప్ మెసేజ్ లు, మెసేజ్ లు ఇలా ఒకటేమిటి ఓటర్ల ప్రాణాలు ఓట్లకోసం తీస్తున్నారు.

పొలాలకు కూడా వెళ్లి ప్రచారం చేస్తున్న నాయకులు
తాము బాగా ప్రచారం చేస్తున్నామని రాజకీయ పార్టీల నాయకులు భావిస్తున్నా, ఇది ఎక్కడ తలనొప్పి రా బాబు అంటూ ఓటర్లు మాత్రం చిరాకు పడుతున్నారు. తమ పనులు చేసుకోనివ్వకుండా, తమను ఇబ్బంది పెడుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులను రైతు కూలీలను కూడా వదలకుండా, పొలాల పైన కూడా ఓట్ల కోసం దాడి చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇంట్లో బిజీగా ఉన్నాము అని చెప్పినా, స్నానం చేస్తున్నామని చెప్పినా ఓటర్ ని కలిసి ఒప్పించే వరకు అక్కడే కూర్చుంటున్నారు. అవతల వాళ్ళ ఇబ్బందిని ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
నేతల ప్రచారంతో అసహనంలో ఓటర్లు
ఒక్కసారిగా చుట్టుముట్టి కరపత్రాలు చేతుల్లో పెట్టడం, ఊపిరాడనివ్వకుండా మా పార్టీకి ఓటేయాలని ఉదర కొట్టడం వంటి చర్యలు ఓటర్లను చిరాకు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో విపరీతంగా వాట్సప్ మెసేజ్ ద్వారా తమ పార్టీ అభ్యర్థి కే ఓటు వెయ్యాలని ప్రచారం చేస్తున్న క్రమంలో వాట్సప్ వాడడం కూడా మానేస్తున్నారు ప్రజలు. ప్రజల సమస్యలను వాళ్ల ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా వాళ్ల సోది వాళ్లు చెప్తుంటే, మా బాధలు మావి, ఈ గోల ఏంటి అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు. ఎన్నికల ప్రచారం ముగిసేలోపు ఒక్కో ఓటర్ ని రెండు మూడు సార్లు చుట్టిరావాలని కంకణం కట్టుకున్న నేతలు, ఇతర జిల్లాల నుంచి చోటామోటా లీడర్లను కూడా పంపి ఆ పనిలో నిమగ్నమయ్యారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మామూలు ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు.
ఓటెయ్యాలని విజ్ఞాపనల ఫోన్ కాల్స్ , నంబర్స్ బ్లాక్ చేస్తున్న ఓటర్లు
ఇక తమకే ఓటు వేయాలని పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో సదరు నెంబర్లను కూడా బ్లాక్ చేస్తున్నారని సమాచారం. ఈ సారి బహిరంగ సభలకు, రోడ్ షో లకు ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో ఇంటింటి ప్రచారం చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల నేతలు పని చేస్తున్నారు. రాజకీయ నాయకుల తీరుతో విసుగు చెందిన కొంత మంది ఓటర్లు ఇళ్ళముందు తాళాలు వేసుకుని, వెనక నుంచి ఇళ్లకు రాకపోకలు సాగిస్తున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా చోటుచేసుకోని చిత్రాలన్నీ హుజూర్ నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం రాజకీయవర్గాలకు కీలకంగా మారగా, ఓటర్ల సహనానికి మాత్రం అసలు పరీక్షగా మారిందని నియోజకవర్గ ఓటర్లు లబోదిబోమంటున్నారు.












Click it and Unblock the Notifications