Huzurabad : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆస్తులు ఎంతంటే...
హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి గెల్లు శ్రీనివాస్ నామినేషన్కు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. చరాస్తులు రూ.2,82,402.44 కాగా, స్థిరాస్తుల విలువ రూ.20,00,000గా పేర్కొన్నారు. తన ఏడాది సంపాదన కేవలం రూ. 4.98 లక్షలుగా పేర్కొన్నారు.
2020-21లో గెల్లు శ్రీనివాస్ సంపాదన రూ. 3.13 లక్షలు ఉండగా.. 2021లో 4.98 లక్షలకు చేరింది. ఆయన భార్య శ్వేత ఏదాది సంపాదన కూడా కేవలం రూ.లక్షల్లోనే ఉంది. 2020-21లో ఆమె సంపాదన రూ. 4.50 లక్షలు ఉండగా, 2021లో 4.60 లక్షలకు చేరింది. తన ఆస్తులు, సంపాదనతో పాటుగా.. తనపై ఉద్యమకాలం నుంచి ఉన్న కేసుల వివరాలు కూడా అఫిడవిట్లో పొందుపరిచారు గెల్లు శ్రీనివాస్ యాదవ్.
రెండు గుంటల భూమి ఉన్న నిరుపేద అభ్యర్థి ఒకవైపు... రెండు వందల ఎకరాలున్న ఆసామి మరోవైపు.. అంటూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరుపున ఉపఎన్నికలో టీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.రెండు గుంటల గెల్లుకు,రెండు వందల ఎకరాల ఈటలకు మధ్య పోటీ అని చెప్పడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందవచ్చునని టీఆర్ఎస్ భావిస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదన ఆర్జించిన వ్యక్తికి,తొలి నుంచి నిస్వార్థంగా అటు ఉద్యమంలో,ఇటు పార్టీలో పనిచేస్తున్న వ్యక్తికి మధ్య పోటీ అని టీఆర్ఎస్ గట్టిగా ప్రచారం చేస్తోంది. మరోవైపు ఈటల కూడా సానుభూతినే నమ్ముకున్నారు. గులాబీ జెండా మోసిన తనను కేసీఆర్ గెంటేశారని... తెలంగాణ వ్యతిరేక శక్తులను దగ్గర చేర్చుకుని... నమ్మిన బంటులా పనిచేసిన తనను బయటకు పంపించారని మొదటి నుంచి చెబుతున్నారు. కేసీఆర్ తనపై ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ ప్రజలు తనను కడుపులో పెట్టుకుంటారనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.
ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో ఎంతో తర్జనభర్జన పడిన టీఆర్ఎస్... చివరకు గెల్లు శ్రీనివాస్ వైపే మొగ్గుచూపింది. ఉద్యమకారుడు,స్థానికుడు,బీసీ నేత కావడంతో గెల్లు శ్రీనివాస్ వైపు కేసీఆర్ మొగ్గుచూపారు. బీసీ వర్గానికి చెందిన ఈటలను అదే వర్గానికి చెందిన నేత అయితేనే ఎదుర్కోగలడని భావించారు. అంతకుముందు,పాడి కౌశిక్ రెడ్డి,ముద్దసాని కశ్యప్ రెడ్డి,ముద్దసాని మాలతి,స్వర్గం రవి,వకుళాభరణం కృష్ణమోహన్ తదితరుల పేర్లను కేసీఆర్ పరిశీలించినప్పటికీ చివరికి గెల్లుకే అవకాశం ఇచ్చారు. గురువారం(సెప్టెంబర్ 30) గెల్లు శ్రీనివాస్ యాదవ్కు స్వయంగా బీఫారమ్ అందజేసిన కేసీఆర్... ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.28లక్షల చెక్కును కూడా అందించారు.