Huzurabad by-poll: ఓటేసిన ఈటల రాజేందర్ దంపతులు.. ఈవీఎంల మొరాయింపు; ఘర్షణలు !!
తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న హుజురాబాద్, బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రలోభాల పర్వం పీక్స్ కు చేరుకుంది. మరోవైపు ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో సైలెంట్ ఓటింగ్; ఎవరి కొంప ముంచుతుందో? నేతల్లో టెన్షన్!!
కమలాపూర్ మండలంలో ఓటేసిన ఈటల రాజేందర్ దంపతులు
ఇప్పటివరకు ఉన్న పోలింగ్ అప్డేట్స్ చూస్తే హుజురాబాద్ ఉప ఎన్నికలలో కమలాపూర్ మండల కేంద్రంలోని 262 పోలింగ్ బూత్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆయన సతీమణి ఈటల జమున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో 7 గంటల నుండి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కరోనా నిబంధనలను పాటిస్తూ , సామాజిక దూర నిబంధనలను పాటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు.
ఆరుచోట్ల ఈవీఎంల మొరాయింపు; డబ్బుల కోసం టేకుర్తి గ్రామంలో ఆందోళన
ఇదిలా ఉంటే హుజురాబాద్ ఇల్లంతకుంట 224 బూత్ లో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎం మొరాయింపుతో సాంకేతిక సమస్య తలెత్తి పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. కమలాపూర్ లోని 262 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు తారుమారు కావడంతో ఓటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇక ఈ సమస్యను అధికారులు సరి చేశారు. కమలాపూర్ మండలం ఉప్పల్ లో 295 పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటర్లు ఓటు వేయడానికి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో డబ్బులు ఇవ్వడం లేదని సర్పంచ్ ఇంటిముందు గ్రామస్తులు ధర్నాకు దిగారు. కొంతమందికి డబ్బులు ఇచ్చి తమకు డబ్బులు ఇవ్వలేదు అంటూ ఆందోళన చేస్తున్న గ్రామస్తులు డబ్బులు ఇస్తేనే ఓటేస్తాం అంటూ ఆందోళన బాట పట్టారు.
ఇల్లంతకుంట మండలంలో గజ్వేల్ మార్కెట్ చైర్మన్ ను అడ్డుకున్న గ్రామస్తులు
ఇదే సమయంలో ఇల్లంతకుంట మండలంలో శ్రీ రాముల పల్లె గ్రామంలో గజ్వేల్ మార్కెట్ చైర్మన్ అక్కడే ఉంటూ ఎన్నికల ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆయనను నిలదీశారు. దీంతో అక్కడ కొంత గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది .వీణవంక మండలం కోర్కెల్ పోలింగ్ కేంద్రంలో టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది . ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. హుజురాబాద్ లో ఉప ఎన్నిక పోలింగ్ చిన్నచిన్న ఇబ్బందుల మధ్య శనివారం ఉదయం తొమ్మిది గంటల వరకూ 10.50శాతం జరిగినట్లుగా సమాచారం.
Recommended Video
ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్, కలెక్టర్ కర్ణన్
ఇదిలా ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ పర్యవేక్షించడం కోసం ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ హుజురాబాద్ కు చేరుకున్నారు. పోలింగ్ సరళిని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు 6 చోట్ల ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తింది. సమస్యను రెక్టిఫై చేసి పోలింగ్ ప్రారంభించామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నుంచి చిన్నచిన్న ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.