హుజురాబాద్ లో ప్రలోభాల పర్వం: కవర్లలో నగదు పంపిణీ షురూ; ఓటుకు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!
హుజురాబాద్ లో నేటితో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మరికొద్ది గంటల్లో ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే హోరాహోరీగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసిన అధికార టీఆర్ఏ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ల నాయకులు, హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఇప్పటికే ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ లు పెద్ద ఎత్తున ప్రచారం సాగించాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ కు, బిజెపికి మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది.

హుజురాబాద్ లో ప్రలోభాల పర్వం
ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో మద్యం ఏరులై ప్రవహిస్తుంది. ఇక డబ్బు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు రాజకీయ పార్టీల నాయకులు. ఈసారి ఇంతకు ముందు ఎన్నడూ ఊహించని విధంగా ప్రలోభాల పర్వం సాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచార సమయంలో దసరా పండుగ సందర్భంగా తాగినంత మందు, తిన్నంత మాంసం ఓటర్లకు పంచిన రాజకీయ పార్టీల నాయకులు ఇప్పుడు డబ్బుల కవర్లను సిద్ధం చేస్తున్నారు.

ఒక్క ఓటు కూడా కీలకమే .. ఓటుకు 20,000 వరకు ఇచ్చే అవకాశం
ఇక హుజురాబాద్ లో ఓటుకు 20,000 వరకు ఇచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే సరిసేడు, ఇల్లంతకుంట మండలంలో కవర్లలో పెట్టి మరీ డబ్బులు పంపిణీ జరుగుతుందని సమాచారం. అధికార పార్టీ వోటర్లను ప్రలోభాలకు గురి చేయడం కోసం పెద్ద ఎత్తున డబ్బులు పంచుతుందని బిజెపి ఆరోపిస్తోంది. ఇంట్లో ఎంత మంది ఓటర్లు ఉంటే అంత కవర్ పై సంఖ్య వేసి అందులో ఒక్కొక్క ఓటుకు ఆరు వేల చొప్పున పంపిణీ జరుగుతోందని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న నగదు పంపిణీగా చెప్తున్నారు.

టీఆర్ ఎస్ నేతలు ఓటుకు 20 వేలు ఇస్తున్నారని బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపణ
అవసరాన్ని బట్టి ఒక్కో ఓటుకు 20 వేల రూపాయలు అయినా ఇచ్చే అవకాశం ఉందని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటుకు 20000 రూపాయలు అయినా ఇస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు ఓట్లను కొనుగోలు చేస్తున్నారని మండిపడుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటర్లు ఈటెల రాజేందర్ కు ఓటు వేస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడుతున్నారు.
హుజురాబాద్ లో బయటపడుతున్న కట్టల పాములు
టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఈటల రాజేందర్ ను ఓడించాలని, ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేయాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ఇప్పటికే వందల కోట్ల రూపాయలు హుజూరాబాద్ నియోజకవర్గం కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడటంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో కట్టల పాములు బయటపడుతున్నాయి. హుజురాబాద్ లో గెలుపు విపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకం కావడంతో బిజెపి , కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా బిజెపి నాయకులు దుబ్బాక తరహాలో విజయాన్ని హుజురాబాద్ లో కూడా కైవసం చేసుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తే సీఎం కేసీఆర్ ను ఓడించినట్టేనని తెగ ప్రచారం చేస్తున్నారు.

ఓటర్లకు ఓట్ల పండుగనే కాదు నోట్ల పండుగ కూడా
ఏది ఏమైనా హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లకు ఓట్ల పండగనే కాదు నోట్ల పండుగ కూడా వచ్చిందని రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. తాము కూడా హుజురాబాద్ ఓటర్లం అయితే బాగుండు అని తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ పైనే ప్రధాన ఆసక్తి కనిపిస్తోంది. సీఎం కెసిఆర్ గెలుస్తాడా? ఈటల రాజేందర్ విజయం చేజిక్కించుకుంటాడా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications