Huzurabad by-poll: వాళ్ళకిచ్చి మాకు డబ్బులివ్వరా? డబ్బుల కోసం ఓటర్ల ఆందోళన.. అవాక్కైన తెలంగాణా!!
హుజురాబాద్ ఉప ఎన్నికలు చిత్రాలు అన్నిఇన్ని కాదు. హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దగ్గర్నుండి ఇప్పటివరకు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇంతకు ముందు ఎన్నికల్లో ఎప్పుడూ చూడని కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ప్రలోభాల పర్వంలోనూ నువ్వా నేనా అంటూ పోటీపడుతున్న ప్రధాన పార్టీల నాయకులు డబ్బులు పంపకం లోనూ సరికొత్త పంథాకు తెరతీశారు.
హుజురాబాద్ ఓటర్లలో అసాధారణ మార్పు .. సాగుతున్న ఎన్నికల బిజినెస్
ఇదిలా ఉంటే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల నాయకులే కాదు, ఓటర్లలో కూడా అసాధారణమైన మార్పు కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలంతా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలని ఆసక్తిగా పరిశీలిస్తున్న సమయంలో హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో అన్న చర్చ జరుగుతుంది. ఇక నియోజకవర్గ ఓటర్లు కూడా ఎవరు ఎంత గొప్పగా ఎన్నికల ప్రచారం నిర్వహించినా మీవల్ల మాకేంటి ? అన్న ధోరణిలో నాయకుల పట్ల తమ వ్యవహారశైలిని కనబరుస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక మొత్తం ఒక బిజినెస్ లా సాగుతుండడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
హుజురాబాద్ రాంపూర్ గ్రామంలో డబ్బుల కోసం రోడ్డెక్కి మరీ రాస్తారోకో
ఇదిలా ఉంటే ప్రచార పర్వానికి తెర పడిన నేపథ్యంలో ప్రలోభ పర్వానికి తెర తీశారు ప్రధాన పార్టీల నేతలు. గత మూడు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా నగదు పంపిణీ జరుగుతుందన్న ప్రచారం జోరందుకుంది. ఇదే సమయంలో చాలా మంది ఓటర్లు తమకు ఇంకా డబ్బులు చేరలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా, ఏకంగా ఒక గ్రామంలో ఓటర్లు అయితే రోడ్డెక్కి మరీ రాస్తారోకో చేశారు. ఇక ఈ పరిణామాలు మొత్తం రాష్ట్రాన్ని షాక్ కు గురిచేశాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఒక పార్టీకి చెందిన నేతలు నగదు పంపిణీ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే వారు కొంత మంది ఓటర్లకు డబ్బులు పంచారని, మరికొంతమందికి డబ్బులు ఇవ్వలేదని స్థానికంగా చర్చ జరిగింది. అంతేకాదు మరికొంతమందికి డబ్బులు ఇవ్వడం మర్చిపోయారా లేదా మళ్లీ వస్తారా అంటూ స్థానికులు గుసగుసలాడుతున్నారు.
జమ్మికుంట హుజురాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
ఇదిలా ఉంటే డబ్బులు రాలేదని అసహనానికి గురైన కొందరు ఓటర్లు తమకు డబ్బులు ఇవ్వలేదని నిరసనకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో కాసేపు హుజురాబాద్ జమ్మికుంట రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రామంలోకి వచ్చిన కొందరు పార్టీ నాయకులు కొంత మంది ఓటర్లకు డబ్బులు ఇచ్చి మరికొందరిని వదిలేశారని నినాదాలు చేస్తూ గ్రామస్తులు నిరసన తెలిపారు. ఇక ఈ పరిణామాలు హుజూరాబాద్ నియోజకవర్గం లోనే కాదు,రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెర తీశాయి .
డబ్బుల కోసం ఓటర్ల ఆందోళన .. అవాక్కయిన తెలంగాణా
ఎన్నికలలో డబ్బులు పంపిణీ జరగడం అనేది బహిరంగ రహస్యమే అయినప్పటికీ, డబ్బులు పంపిణీ సీక్రెట్ గా నిర్వహిస్తారు. ఇక ఓటర్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు తీసుకొని తమకు నచ్చిన వారికి ఓట్లు వేస్తారు. దీనిపై రహస్య మంతనాలు తప్ప బహిరంగ చర్చలు, ఆందోళనలు జరగవు. ఓటర్లు కూడా డబ్బులు ఇచ్చిన వారికే ఓటు వేస్తారు అన్న నమ్మకం కూడా లేదు.
అయితే ఇప్పుడు ఓటర్లు తమకు డబ్బులు ఇవ్వలేదని ఆందోళన చేయడం మాత్రం ఓటర్లలో వస్తున్న అసాధారణమైన మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. ఇక ఇలాంటి పరిస్థితులు డబ్బులు పంచుతున్న రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో పెద్ద తలనొప్పిగా మారతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.