హుజూరాబాద్ ప్రజలంతా నా వెంటే, టీఆర్ఎస్ ఫీజు పీకేది ఆరోజే: ఈటల రాజేందర్
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కమలాపూర్లోని గుండేడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈటల. ఈ సందర్భంగా ప్రజలకు బతుకమ్మ శుభకాంక్షలు తెలిపారు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో తనకు మద్దతుగా ఉండాలని గ్రామ మహిళలను ఈటల రాజేందర్ కోరారు. ఈ క్రమంలో మహిళలంతా ఏకగ్రీవంగా మద్దతు పలికారు. ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ను మరోసారి గెలిపించుకుంటామని ఆయన సమక్షంలోనే తీర్మానం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈటల కోరారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ వెన్నంటే ఉంటానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. పెనుగులాట జరుగుతోంది.. ఏం చేసినా.. నా వెన్నంటే ఉంటామని ప్రజలు వస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఫీజు పీకే రోజు 30వ తేదీయేనని, ఈ విషయం గుర్తుంచుకోండి అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
ఇది ఇలావుండగా, హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతు ప్రకటించింది తీన్మార్ మల్లన్న టీం. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, జిల్లా కన్వీనర్ మహమ్మద్ అఖిల్ పాషా, అసెంబ్లీ కన్వీనర్ చెకోటి రమేష్ .. మల్లన్న విడుదలైన వెంటనే హుజురాబాద్ ఎన్నికలలో ఈటల రాజేందర్కు మద్దతుగా ప్రచారం చేస్తామని తెలిపారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ ఓటమిలో తాము కీలక పాత్ర పోషిస్తామన్నారు. స్టేట్ కమీటీ ఆదేశాల మేరకు హుజురాబాద్లో ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించామని చెప్పారు. తీన్మార్ మల్లన్నను కాపాడాలని కోరేందుకే ఆయన భార్య మమత .. కేంద్ర ప్రభుత్వ సహాయం కోరారన్నారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన వాళ్లలో చాలా మంది మల్లన్న టీం సభ్యులు కాదని తెలిపారు.
Recommended Video
మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్పై తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చాలా అసహనంతో వ్యవహరిస్తున్నారన్నారు. తనపై వెటకారంగా సీఎం మాట్లాడుతున్నారన్నారు. హనుమకొండ జిల్లాలో బుధవారం రఘునందన్ రావు మాట్లాడుతూ... దళితబంధు పథకాన్ని బీజేపీ వ్యతిరేకించలేదన్నారు. దళితబంధును స్వాగతిస్తున్నామని తెలిపారు.దళితబంధు ఆలోచన మంచిదే అని తాను మాట్లాడితే కాంగ్రెస్ వాళ్లు ట్రోల్స్ చేయడం తగదన్నారు. పథకాలు పేదలకు అందలనేది బీజేపీ ఆలోచన అని అన్నారు. దళితులకు 3ఎకరాలు ఇస్తానని ఈరోజు చెప్పలేదు అని సీఎం కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. మాదిగలను వర్గీకరణ చేస్తా అన్నారు.. ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. బీసీ కులాల గుర్తింపు గురించి ఒక్కసారి గెలిచిన తమిళనాడు సీఎం స్టాలిన్ వల్ల అయ్యింది.. మీ వల్ల ఎందుకు కాలేదు అని అన్నారు. మీ లాగా 80వేల పుస్తకాలు చదవలేదు.. కానీ భారత రాజ్యాంగాన్ని చదివానంటూ సీఎంకు రఘునందన్ రావు. చురకలంటించారు.