హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోరు ... ఆ సర్పంచ్ ల నామినేషన్లు చెల్లవన్న ఈసీ ..
హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ దాఖలుకు గడువు ముగిసింది. చివరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. శనివారం వరకు అమావాస్య కావడంతో వేచి చూసిన ప్రధాన పార్టీల అభ్యర్ధులు సోమవారం ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 119 నామినేషన్లు దాఖలు కావటంతో హుజూర్ నగర్ పోరు ఎలా ఉండబోతుంది అన్న చర్చ జోరుగా జరుగుతుంది.

హుజూర్ నగర్ ఎన్నికలకు 119 నామినేషన్లు దాఖలు
కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి నామినేషన్ దాఖలు చేయగా టీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ నుంచి కోటా రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, సీపీఎం నుంచి శేఖర్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అంతే కాకుండా వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ నుంచి నవీన్ కుమార్ మల్లన్న కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికలో పోటీచేసేందుకు మొత్తం 119 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు.

నిజామాబాద్ తరహాలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు
ఈ నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహకరణకు అక్టోబరు 3వ తేదీ వరకు గడువు వుంది. అక్టోబరు 21న పోలింగ్జరగనుండగా, అక్టోబరు 24న కౌంటింగ్ జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
అయితే మునుపెన్నడూ లేని విధంగా హుజూర్ నగర్ నుండి 119 మంది అభ్యర్థులు బరిలో దిగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హుజూర్ నగర్ పోరు కూడా మరో నిజామాబాద్ మారనుందని చర్చ జరుగుతోంది.

సమస్యల సాధన కోసం నామినేషన్లు దాఖలు చేసిన సర్పంచ్లు
ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల సంఘ నాయకులు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నామినేషన్లు దాఖలు చేశారు. ఇక పోడు భూముల సమస్య పరిష్కారం కోసం పలువురు రైతులు, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో సర్పంచ్ లు నామినేషన్లు దాఖలు చేశారు. అంతేకాదు తమ డిమాండ్ల సాధన కోసం అడ్వకేట్లు సైతం హుజురాబాద్ ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్లు వేశారు.

40 మంది సర్పంచ్ ల నామినేషన్ల తిరస్కరణ
నామినేషన్లు పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పత్రాలు సరిగా లేని కారణంగా 40 మంది సర్పంచ్ ల నామినేషన్లు చెల్లవు అంటూ తిరస్కరించింది. అయితే మరో 30 మంది సర్పంచులు నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం పై సర్పంచులు మండిపడుతున్నారు. కావాలనే కుట్రపూరితంగా తమను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకొని, నామినేషన్లు దాఖలు చేసిన సర్పంచ్ల పత్రాలు సరిగా లేవంటూ తిరస్కరించారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఆసక్తికరంగా మారిన హుజూరాబాద్ పోరు
ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ పసుపు రైతులు ఇచ్చిన చైతన్యం హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో జరిగే ఎన్నికల పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇక స్క్రూటినీ తరువాత ఎంత మంది రంగంలో ఉంటారో ఎంత మంది ఉపసంహరించుకుంటారో వేచి చూడాలి .












Click it and Unblock the Notifications