కారు రూపంలో కబళించిన మృత్యువు : అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
అమెరికా : అమెరికాలో మరో తెలుగుతేజం అశువులు బాసింది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థిని రోడ్డు ప్రమాదం కబళించింది. తమ ఇంటి పెద్ద కుమారుడు మృతితో ఆ ఇళ్లు రోదనలతో మునిగిపోయింది.
ప్రమాదంలో మృతి
హైదరాబాద్ కు చెందిన బొంగుల సాహిత్ రెడ్డి ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. నార్త్ కరోలినాలో ఉంటూ చదువుతున్నాడు. ఎప్పటిలాగే బయటకొచ్చినా ఆయనను కారు రూపంలో మృత్యువు కబళించింది. కారు ఢీకొట్టడంతో సాహిత్ రెడ్డి ప్రాణాలొదిలాడు. సాహిత్ మృతితో వారి ఇంట్లో విషాద వదనం నెలకొంది. తమ ఇంటి దీపం ఆరిపోయిందని గద్గత స్వరంతో రోదిస్తున్నారు.
విషాద వదనం
సాహిత్ పేరెంట్స్ హైదరాబాద్ నల్లకుంటలోని పద్మా కాలనీలో ఉంటారు. సాహిత్ మృతి వార్తతో ఒక్కసారిగా వారు షాక్ తిన్నారు. ఆ ఇల్లు దు:ఖసాగరంలో మునిగిపోయింది. సాహిత్ మృతదేహం స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సాహిత్ రెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఆడిక్ మెట్ పద్మాకాలనీలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాహిత్ రెడ్డి మృతి చాలా బాధాకరమని మంత్రి అన్నారు. సాహిత్ రెడ్డి పార్ధీవ దేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆయన చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
శోకసంద్రమే...
పద్మాకాలనీలోని చుట్టపక్కల వారు కూడా సాహిత్ మృతి వార్త తెలిసి బాధపడుతున్నారు. తమతో ఎంతో చనువుగా ఉండే .. సాహిత్ లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక స్నేహితులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.