దారుణం: వ్యక్తిని హత్య చేసి, ఫ్రిజ్లో పెట్టారు, యాజమాని ఫిర్యాదుతో వెలుగులోకి
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్న 38 ఏళ్ల సిద్ధిఖ్ అహ్మద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఇంట్లోనే ఉన్న ఫ్రిజ్లో ఉంచి ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయారు.
ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ యాజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్రిజ్లో సిద్దిఖ్ మృతదేహం కనిపించింది.
రెండ్రోజుల క్రితమే మృతుని భార్య రుబీనా తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఆస్తి తగాదాలా? లేక కుటుంబ విభేదాలా? లేదా మరేదైనా కారణంతో అతడ్ని హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చిన్నారి ప్రాణం తీసిన వివాహేతర బంధం
ఓ మహిళతో వివాహేతర బంధం ఏర్పరచుకున్న వ్యక్తి.. ఆమె కన్న కొడుకుని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండలో ఉండే అజయ్ లాల్, బర్మ మౌనిక 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. కాగా, మనస్పర్థలు రావడంతో కొడుకును తీసుకుని మౌనిక వెళ్లిపోయింది.
కాగా, ఈ క్రమంలో వాషింగ్ మెషిన్ మెకానిక్ మద్దికుంట రాజు అనే యువకుడితో దిల్సుఖ్నగర్లోని కోదండరాంనగర్లో ఉంటూ సహజీవనం చేస్తోంది. కుమారుడి యోగక్షేమాలపై అజయ్ లాల్ వీడియో కాల్ చేసి ఆరా తీసినా.. కనిపించకుండా దాచేది మౌనిక. అయితే, మార్చి 28న భర్తకు ఫోన్ చేసిన మౌనిక.. బాబుకు ఫిట్స్ వచ్చి మృతి చెందాడని తెలిపింది. దీంతో అనుమానాలున్నాయంటూ అతను పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సరూర్ నగర్ పీఎస్కు బదిలీ చేశారు. కాగా, పోలీసుల విచారణలో నిందితుడు రాజు నేరం అంగీకరించాడు. మౌనిక ఇంట్లో లేని సమయంలో చిన్నారి ఛాతిపై బలంగా కొట్టి హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.