చేప ప్రసాదం దాత హరినాథ్ గౌడ్ కన్నుమూత
హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా ప్రతీ ఏడాది అస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి బత్తిని హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. బత్తిని హరినాథ్ గౌడ్కు భార్య సుమిత్రా దేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బత్తిని సోదరులైన హరినాథ్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివరాం గౌడ్, సోమలింగం గౌడ్, ఉమామహేశ్వరగౌడ్లు హైదరాబాద్ నగరంలో సుదీర్ఘ కాలంగా చేపమందు పంపిణీ చేస్తున్నారు. 1847లో హైదరాబాద్ సంస్థానంలోనే చేపమందు ప్రసాదం పంపిణీ కావడం గమనార్హం. సుమారు 176 ఏళ్ల నుంచి బత్తిని వంశస్తులు అస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని అందిస్తున్నారు.

గతంలో పాతబస్తీలో పంపిణీ చేసేవారు. ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు మార్చారు. కొర్రమీను చేప పిల్లలను అక్కడే స్టాల్స్ లో పెట్టి విక్రయిస్తారు. చేప ప్రసాదం కావాలనుకున్న వారు డబ్బులిచ్చి.. చేప పిల్లలను కొనుక్కుంటారు. ఉబ్బసం రోగుల ఇబ్బందుల నుంచి ఊరటనిస్తుందని విశ్వసించి అనేక మంది బత్తిని సోదరుల చేపమందు కోసం ఇక్కడికి వస్తుంటారు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో అస్తమా బాధితులు చేపమందు కోసం తరలిస్తారు. శాకాహారులకు బెల్లంతో కలిపి ప్రసాదం ఇస్తారు. చిన్నపిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు చేపమందును పంపిణీ చేస్తారు. భోజనం చేసిన మూడు గంటల తర్వాతే మందు ఇస్తారు. ఇక, గర్భిణిలకు మాత్రం ఈ చేపమందు ఇవ్వరు. కాగా, చేపమందు కోసం లక్షలాది ప్రజలు తరలివస్తుండటంతో చేపమందు ప్రసాదం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వమే చూస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications