డిసెంబర్ 18 నుంచి బుక్ ఫెయిర్, కెసిఆర్ను పిలుస్తాం: గౌరీశంకర్
హైదరాబాద్: డిసెంబర్ 18 నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో 29వ హైదరాబాద్ బుక్ఫెయిర్ జరుగుతుందని బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. 300 స్టాళ్లలో దేశవ్యాప్తంగా వివిధ పబ్లిషర్లు, వివిధ భాషల్లో ప్రచురించిన పుస్తకాలను ప్రదర్శిస్తారని హైదరాబాదులోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో చెప్పారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, సేజ్, ఓరియంట్ బ్లాక్స్వాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా బుక్ ఫెయిర్లో పాల్గొంటాయని చెప్పారు. విద్యార్థులకు ఉచిత ప్రవేశం ఉంటుంని చెప్పారు. వంద సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ కవులు, రచయితలకు ప్రత్యేక హాలు కేటాయిస్తామని చెప్పారు.
కేజీ నుంచి పీజీ వరకు స్థానిక పాఠ్య పుస్తకాలతోపాటు అంతర్జాతీయంగా అన్ని శాస్ర్తాల పుస్తకాలు బుక్ ఫెయిర్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఫెయిర్లో పుస్తకాల కొనుగోలుపై పదిశాతం రాయితీనిస్తున్నామని ఆయన వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మరింత రాయితీ కల్పనకు కృషి చేస్తున్నామని గౌరీశంకర్ చెప్పారు.
రాష్ట్రప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ ఫెయిర్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ఆయాశాఖలు స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించామన్నారు. అన్నిభాషల స్టాళ్లు ఉంటాయని ఆయన తెలిపారు. ఈసారి బుక్ఫెయిర్లో తెలంగాణ సాంస్కృతిక నేపథ్యంతో విభిన్న కోణంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. బుక్ఫెయిర్ నిర్వహణకు ప్రభుత్వం ఎంతో సహకరిస్తుందని గౌరీశంకర్ అన్నారు.
బుక్ ఫెయిర్కు సీఎం కే చంద్రశేఖర్రావును ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. నిరుడు ఆరు లక్షల మంది పుస్తక ప్రియులు బుక్ఫెయిర్ను సందర్శించారని, ఈ ఏడాది 10 లక్షల మంది వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థులు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందని బుక్ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ అన్నారు. ఈ సమావేశంలో బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు నవోదయ సాంబశివరావు, సహాయ కార్యదర్శి శోభన్ బాబు, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, శృతికాంత్ పాల్గొన్నారు.