హైదరాబాద్ రోడ్లపైకి త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు
హైదరాబాద్: నగరంలో ఒకప్పుడు ప్రత్యేక ఆకర్షణగా డబుల్ డెక్కర్ బస్సులు మరోసారి ప్రజల ముందుకు రానున్నాయి. డబుల్ డెక్కర్ బస్సుల్లో ఎక్కాలని ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ప్రజలకు త్వరలోనే ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
దాదాపు 20 ఏళ్ల క్రితం చిన్నారులను, పెద్దలను ఎంతగానో ఆకట్టుకున్న ఈ డబుల్ డెక్కర్ బస్సులు మరోసారి నగరంలోని వీధుల్లో దర్శనమివ్వనున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో త్వరలోనే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి.
గత కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ నగరంలో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులను తీసుకురావాలంటూ మంత్రిని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకోసం ప్రయత్నిస్తామన్నారు.
కాగా, తాజా సమాచారం ప్రకారం త్వరలోనే నగరంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నగరంలోని మూడు రూట్లలో తొలుత ఈ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించారు. తర్వరలోనే దీనికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ టెండర్లకు ఆహ్వానించనుంది.
ఏయే రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులను నడపాలని అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఫ్లైఓవర్లు లేని, డబుల్ డెక్కర్ బస్సులకు ఎలాంటి ఆటంకం లేని మార్గాల్లో నడపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి.