వారిచ్చిన సమాచారం అంతంతే: నవదీప్ చాలా కీలకం, 'అకున్కు భద్రత పెంచుతాం'
హీరో నవదీప్ విచారణ తొమ్మిది గంటలుగా కొనసాగుతోంది. కెల్విన్ వద్ద ఉన్న కాల్ డేటా ఆధారంగా సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్: హీరో నవదీప్ విచారణ తొమ్మిది గంటలుగా కొనసాగుతోంది. కెల్విన్ వద్ద ఉన్న కాల్ డేటా ఆధారంగా సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
చదవండి: వర్మ-చార్మీలకు అకున్ సబర్వాల్ కౌంటర్
రేపు (మంగళవారం) ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను ప్రశ్నించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలని సిట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.
నవదీప్ కీలకం
నటుడు నవదీప్ ఈ మొత్తం డ్రగ్ కేసులో అత్యంత కీలకుడని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. తొలి నాలుగు రోజుల విచారణ ఒక ఎత్తు అయితే నవదీప్ విచారణ అంతకన్నా ఎక్కువేనని మొదటి నుంచి భావిస్తున్నారు. అనుకున్నట్లుగా ఆయనను సుదీర్ఘంగా విచారిస్తున్నారు.
వారి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా..
పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్లు విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగా నవదీప్ను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజుల నుంచి పెద్దగా సమాచారం లభించలేదని, తరుణ్, పూరీల నుంచి లభించిందని తెలుస్తోంది.
ఆధారాలు ఇవే లభించాయా?
పూరీ ప్రత్యక్షంగా డ్రగ్స్ వ్యాపారంలో లేకున్నా, తాను కొనుగోలు చేసి ఇతరులకు అందించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. శ్యామ్ కే నాయుడి ఖాతా నుంచి కెల్విన్ కు డబ్బు వెళ్లడం మినహా అతనిపై డ్రగ్స్ వాడాడన్న ఆరోపణలు కూడా లేవని తెలుస్తోంది. శనివారం నాడు తరుణ్ను విచారించినప్పుడు మాత్రం కొంత విషయం తెలిసిందని అంటున్నారు. ఇప్పుడు నవదీప్ విచారణ మరింత కీలకం అని చెబుతున్నారు.
నవదీప్ ఇలా వచ్చాడు
ఉదయం విచారణకు నవదీప్ ఇంటి నుంచి బయలుదేరుతాడని అందరూ భావించారు. కానీ అతను అంతకుముందు రాత్రే కుటుంబ సభ్యులతో కలిసి పార్క్ హయత్ హోటల్కు మకాం మార్చాడని తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ కార్యాలయం వచ్చిన అతను ఓ నమస్కారం పెట్టి, లోనికి వెళ్లాడు.
అకున్కు భద్రత పెంపు, ఎవర్నీ వదిలి పెట్టం.. నాయిని
ఇదిలా ఉండగా, డ్రగ్ వ్యవహారంలో ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. ఎక్సైజ్ అధికారి అకున్ సబర్వాల్కు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచుతామని చెప్పారు.