కేసీఆర్ పాలనకు జలగండంలో చిక్కుకున్న విశ్వనగరమే సాక్ష్యం .. విజయశాంతి ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పాలనను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి విమర్శల బాణాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తిన తాజా పరిస్థితులను, భాగ్యనగరం ముంపుకు గురి కావడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమంటూ విజయశాంతి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో దారుణ పరిస్థితులకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని పలుమార్లు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు తమ పాలనలో ఏ మార్పు చేశారో చూపించాలని విజయశాంతి ప్రశ్నించారు.

హైదరాబాద్ తాజా పరిస్థితిపై విజయశాంతి పోస్ట్
ఈ మేరకు విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కెసిఆర్ పరిపాలన ఏ విధంగా ఉందో జలగండంలో చిక్కుకున్న విశ్వ నగరాన్ని చూస్తే చాలు అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విజయశాంతి పోస్ట్ పెట్టారు. జంటనగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ కురిసిన భారీ వర్షాలు ప్రజల్ని గతంలో ఎప్పుడూ లేనంత నిస్సహాయ పరిస్థితుల్లోకి నెట్టివేయడం కళ్ళారా చూశాం అని పేర్కొన్న విజయశాంతి వరదనీరు కాలువల్లా పారని వీధి లేదు, ఏరులై ప్రవహించని రోడ్డు లేదు అంటూ హైదరాబాద్ తాజా పరిస్థితిని పేర్కొన్నారు.

కేసీఆర్ దొరగారు ఆరేళ్ళ పాలనలో ఏం చేశారో ?
దశాబ్దాల కాలంగా నెలకొన్న ఈ దౌర్భాగ్య పరిస్థితికి గత ప్రభుత్వాలే కారణమని సీఎం కేసీఆర్ దొరగారు ఎన్నోమార్లు నిందించారని విజయశాంతి గుర్తుచేశారు. ప్రకృతిని నియంత్రించడం మన వల్ల కాదు . కానీ చినుకు పడితే చాలు చెదిరిపోయే జంటనగర ప్రజలను వరద కష్టాల నుంచి రక్షించేందుకు గడచిన మీ ఆరేళ్ళ పరిపాలనా కాలంలో ఏ కాస్తయినా చిత్తశుద్ధితో సేవ చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు అంటూ విజయశాంతి కేసీఆర్ సర్కార్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరేళ్లుగా అధికారంలో ఉంటున్న టిఆర్ఎస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసి ఉంటే ఇంతటి విపత్తు వచ్చేది కాదన్నారు.

ప్రజల సమస్యలకు మీరేం పరిష్కారాలు చూపారు?
వరదలు వచ్చినా ఇంత నష్టం జరగకుండా తక్కువ ఇబ్బందులతో ప్రజలు గట్టెక్కేవారని విజయశాంతి అభిప్రాయపడ్డారు.
వానలు తగ్గినా రోజుల తరబడి కాలనీలకు కాలనీలు నీళ్ళల్లోనే నానుతుండటం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ పట్టించుకుంటే కరెంట్ కోతలు కూడా చాలావరకు తగ్గి ఉండేవన్నారు . కేసీఆర్ సర్కారు పాలనా పగ్గాలు అందుకున్న మొదటి, మలి విడతల పరిపాలనా కాలంలో ఈ పరిస్థితుల నుంచి పౌరులను రక్షించేందుకు ఏ పరిష్కారాలు చూపించారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు అంటూ విజయశాంతి సీఎం కేసీఆర్ ను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా సూచించారు.
Recommended Video

మీపాలనలో మీరు చేసిందేమిటి ? ప్రశ్నించిన విజయశాంతి
టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందే ఎన్నో చెరువుల దురాక్రమణ, భూముల కబ్జాలు, అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని కేసీఆర్ పదే పదే అన్నారని కానీ, టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిందేమిటి? మీరైనా ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వెయ్యగలిగారా? అంటూ ప్రశ్నించారు. మీ నిర్వహణ ఏ తీరున ఉందో జలగండంలో చిక్కుకున్న మీ కలల విశ్వనగరాన్ని చూస్తే చాలు అని విజయశాంతి సీఎం కేసీఆర్ కు సూటిగా పదునైన మాటల బాణాలు ఎక్కుపెట్టారు.












Click it and Unblock the Notifications