జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ కేసు: ఐదురోజుల పోలీస్ కస్టడీకి ముగ్గురు మైనర్లు, జువైనల్ బోర్డ్ కీలక సూచనలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో బాలిక సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లే. వీరిలో ముగ్గురు మైనర్లను ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతిచ్చింది. దీంతో ఈ ముగ్గురిని రేపట్నుంచి(జూన్ 10) ఐదు రోజులపాటు జువైనల్ హోంలోనే పోలీసులు విచారించనున్నారు.
న్యాయవాది సమక్షంలో మైనర్లను విచారణ చేసి వాంగ్మూలం తీసుకోనున్నారు. కాగా, పోలీసు దుస్తులు లేకుండా సాధారణ దుస్తుల్లోనే వెళ్లి విచారణ చేయాలని పోలీసులను జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ను ఇప్పటికే చంచల్గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గురువారం నుంచి 12వ తేదీ వరకు సాదుద్దీన్ మాలిక్ కస్టడీకి కోర్టు అనుమతించింది.

మరోవైపు, జూబ్లీహిల్స్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితులైన ఐదుగురు మైనర్లను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో 2015లో జువైనల్ జస్టిస్ యాక్ట్కు చేసిన చట్ట సవరణను పోలీసులు ఉదహరిస్తున్నారు. తీవ్ర నేరం చేసే మైనర్లను చట్ట ప్రకారం మేజర్గా పరిగణించవచ్చని చెబుతున్నారు.ఈ కేసులో ఐదుగురు మైనర్లు 16 నుంచి 18ఏళ్ల లోపు వాళ్లున్నారు.
అయితే, ఐదుగురు మైనర్లు.. తాము చేస్తున్న తప్పు గురించి తెలిసి కూడా అత్యాచారం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. 16 నుంచి 18 ఏళ్ల వయసున్న మైనర్లు తీవ్ర నేరం చేస్తే చట్టప్రకారం వాళ్లను మేజర్లుగా పరిగణించి, తగిన శిక్ష విధించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. 2015లో ఈ మేరకు జూవైనల్ చట్టానికి సవరణలు చేసిన విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో 2017లో 10 ఏళ్ల బాలుడిని 17ఏళ్ల మైనర్.. అసహజ లైంగిక దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసులో 17 ఏళ్ల బాలుడిని జువైనల్ కోర్టు మేజర్గా పరిగణించి జీవిత ఖైదు విధించిన విషయాన్ని పోలీసులు పేర్కొంటున్నారు.
ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే నేరాన్ని మైనర్లు చేసినప్పుడు వాటిని తీవ్ర నేరంగా పరిగణించి... మైనర్లకు కూడా కఠిన శిక్షలు వేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఐదురుగు మైనర్లకు సంబంధించి నేరాభియోగపత్రం దాఖలు చేసిన అనంతరం... విచారణ జరిగే సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరనున్నారు. ఈ మేరకు పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications