మద్యం తాగించి మరదలిపై బావ అత్యాచారం, అరెస్ట్
హైదరాబాద్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యవతికి బలంవంతంగా మద్యం తాగించి ఆమె బావ, అతడి స్నేహితుడూ అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం గాంధీనగర్లోని సబర్మతినగర్లో యువతి (18) తండ్రితో కలిసి నివసిస్తోంది.
మెహిదీపట్నంలో ఉంటున్న తన అక్క ఇంటికి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఆటోలో వెళుతోంది. లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని కట్ట మైసమ్మ ఆలయం వద్దకు చేరుకున్నాక ఆ యువతికి వరుసకు బావ అయ్యే ఉస్మాన్ (36), అతడి మిత్రుడు పీయూష్ (29) ఆమె ప్రయాణిస్తున్న ఆటోను అడ్డుకున్నారు.
అనంతరం ఆమెను తమ ఆటోలో ఎక్కించుకుని డీబీఆర్ మిల్లు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి, అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమెను గాంధీనగర్లోని ఎల్ఐసీ బ్రిడ్జి సమీపంలో వదిలి పరారయ్యారు.
ఆమె కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు చివరకు అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతిని గుర్తించారు. వెంటనే ఆమెను 108 సిబ్బందితో కలిసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉస్మాన్, పీయూష్లపై ఇన్ స్పెక్టర్ మోహన్ కుమార్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో ఆమెను పీయూష్ పెళ్లి చేసుకునేందుకు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.