భోలక్పూర్ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్ భారీ అగ్నిప్రమాదం: తీవ్రంగా శ్రమించి మంటలార్పారు
హైదరాబాద్: నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భోలక్పూర్లోని స్క్రాప్ గోడౌన్లో శనివారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. జనావాసాల మధ్యే గోడౌన్ ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన గోడౌన్ వద్దకు వెళ్లే మార్గం చిన్న గల్లీలుగా ఉండటంతో ఫైరింజిన్లు వెళ్లలేని పరిస్థితి ఉంది.
తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పివేశాయి. మూడు ఫైరింజిన్లు మంటలను ఆర్పేందుకు శ్రమించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులంతా ఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భారీగా మంటలు చెలరేగడంతో గోడౌన్ దాదాపు పూర్తిగా కాలిపోయింది.
పాశమైలారం పారిశ్రామికవాడలోనూ భారీ అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని పెయింట్, రసాయన పరిశ్రమల్లో శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి.
ముందుగా పెయింట్ పరిశ్రమలో మంటలు వచ్చాయి. వాటిని అదుపులోకి తీసుకురాలేకపోవడంతో పక్కనే ఉన్న రసాయన పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి. దీంతో రసాయనాలతో కూడిన డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. మంటలు రసాయన పరిశ్రమ అంతటికి వ్యాపించడంతో యంత్రాలు కూడా దగ్ధమయ్యాయి.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు సంగారెడ్డి, పటాన్చెరు, బీడీఎల్, బొల్లారం ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.