ఢిల్లీ కంటే హైదరాబాద్ సేఫ్: ఎంపీ కవిత, జెండా ఊపిన జయసుధ
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ సురక్షిత నగరమని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం అన్నారు. మహిళల భద్రతే ప్రధాన ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని ఆమె చెప్పారు.
హైదరాబాదులో షీ టీమ్స్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఉత్సవాలు జరిగాయి. అంతకుముందు షీ టీమ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే జయసుధ, ఎంపీ కవితలు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఇప్పటికీ మహిళలు ఏదైనా చెబితే దానిని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి భారత దేశంలో ఉండటం బాధాకరమన్నారు. మహిళల భద్రత విషయమై అవసరమైతే చట్టంలో మార్పు కోసం పార్లమెంటు సభ్యురాలిగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
బంగారు తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పని చేస్తున్నారన్నారు. బాలికలు, మహిళల రక్షణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. మాట ఇచ్చిన ప్రకారం షీ టీమ్స్ ఏర్పాటు చేశారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ పని చేస్తున్నాయని చెప్పారు. షీటీమ్స్ సక్సెస్ కోసం కమిషనర్ సీవీ ఆనంద్ ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. మహిళా ఉద్యోగులకు షీటీ మ్స్ భరోసా ఇచ్చిందని, వేధింపులకు గురైన మహిళలు ధైర్యంగా చట్టం ముందుకు రావాలని చెప్పారు.
కెసిఆర్ బెజవాడ పర్యటన ఇదీ...
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం విజయవాడలో కలవనున్నారు. అయుత చండీ యాగానికి ఆహ్వానిస్తారు. ఉదయం 11.30గం.కు హైదరాబాద్ బేగంపేట నుంచి కేసీఆర్ విజయవాడ వెళ్తారు.
చంద్రబాబును ఆహ్వానించిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.15 గం.కు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ను స్వయంగా చంద్రబాబు ఆహ్వానించిన విషయం తెలిసిందే. బెజవాడ కనకదుర్గమ్మ వారిని కెసిఆర్ దర్శించుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ, పూర్తిగా తెలియాల్సి ఉంది.