బడంగ్పేట్ హత్యలు: అందుకే చంపేశాను.. పోలీసుల ఎదుట నిందితుడు
హైదరాబాద్: మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేటలో మంగళవారం భార్యాపిల్లలను హత్యచేసిన కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
నిందితుడు సురేందర్ లొంగిపోవడంతో.. అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ సందర్భంగా సురేందర్ హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి వెల్లడించాడు.
ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ పద్మశాలిపురానికి చెందిన సంగిశెట్టి సురేందర్(32) కుటుంబంతో కలిసి తెల్లాపూర్లోని కొమరంభీం కాలనీలో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య వరలక్ష్మి(24), పిల్లలు రితేష్(5), యశస్విని(3) ఉన్నారు.
లింగంపల్లిలోని శ్రీలక్ష్మీ ఆటో ఇంజినీరింగ్ వర్క్ షాపులో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా సురేందర్ కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి. వరలక్ష్మికి, సురేందర్ తల్లికి ఏమాత్రం పడటం లేదు. ఈ విషయమై భార్యను సర్దుకుపోవాలని చెప్పాడు సురేందర్. తన తల్లిని, సోదరిని బాగా చూసుకోవాలని చెప్పేవాడు.
ఇటీవల ఉగాది పండుగవేళ.. భార్యతో కలిసి అత్తగారి ఇంటికి వెళ్లాడు సురేందర్. మంగళవారం తెల్లవారుజామున సురేందర్ తల్లి ఫోన్ చేసింది. తాను ఇంటికి వస్తున్నట్టు తల్లి చెప్పడంతో.. భార్యాపిల్లలను తీసుకుని బయలుదేరాలనుకున్నాడు. కానీ భార్య అందుకు నిరాకరించింది.
ఇంటికి రావద్దని చెప్పినా.. అత్త మళ్లీ ఎందుకు వస్తోందంటూ భర్త సురేందర్ తో వరలక్ష్మి గొడవపడింది. ఆ సమయంలో సురేందర్ అత్త వంటగదిలో ఉన్నారు. గొడవ తారాస్థాయికి చేరడంతో.. భార్యను కుమార్తెను గొంతు నులిమి హత్య చేశాడు సురేందర్. ఇంటి బయట ఆడుకున్న కుమారుడిని కూడా లోపలికి పిలిచి.. అతన్ని కూడా హత్య చేశాడు.
వీఆర్వో ఎదుట లొంగిపోయాడు:
హత్యానంతరం అదేరోజు మధ్యాహ్నం బడంగ్పేట వీఆర్వో రఘుపతి ముందు సురేందర్ లొంగిపోయాడు. ఆపై వీఆర్వో మీర్పేట పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని కారు, సెల్ ఫోన్ సీజ్ చేశారు. హత్య కారణాలను మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.