శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణ: బిడ్ల స్వీకరణ, 13 వరకే
హైదరాబాద్: మెట్రో విస్తరణ పనుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా, నగరంలోని శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో నిర్మాణం కోసం ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల ప్రీ బిడ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితోపాటు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు.
మంగళవారం నుంచి డిసెంబర్ 13 వరకు కన్సల్టెన్సీల నుంచి బిడ్లను స్వీకరించనున్నారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు రూ. 6250 కోట్ల అంచనాతో 31 కిలోమీటర్ల దూరం మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.
డిసెంబర్ 9న మెట్రో నిర్మాణానికి రాయదుర్గంలో సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ నగరాన్ని శంషాబాద్ విమానాశ్రయంతో అనుసంధానం చేస్తూ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది.
ఐటీ హబ్ మైండ్ స్పేస్ (రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 31 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైను నిర్మించనున్నట్లు తెలిసింది. మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి, నానక్ రాంగూడ జంక్షన్ల నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు కొత్తగా మెట్రో రైలు సౌకర్యం రానుంది. మరిన్ని మార్గాల్లో కూడా మెట్రో సేవలను విస్తరించేందుకు చర్చలు సాగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు కూడా మెట్రో తమ ప్రాంతం నుంచి కూడా చేపట్టాలని కోరుతున్నారు.