Charminar: పార్కింగ్ కష్టాలకు చెక్: చార్మినార్ దగ్గర మూడంతస్తుల్లో భవన నిర్మాణం
హైదరాబాద్: నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన చార్మినార్ వద్ద పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్మినార్ను చూసేందుకు కుటుంబ సమేతంగా, స్నేహితులతో కలిసి వచ్చే అనేక మంది పర్యాటకులకు పార్కింగ్ సమస్య చాలా ఏళ్లుగా వేధిస్తున్న విషయం తెలిసిందే.
వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలం లేక పర్యాటకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పార్కింగ్ సమస్యను లేకుండా చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. చార్మినార్కు నలువైపుల నుంచి పర్యాటకుల కోసం మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.

చార్మినార్ బస్ డిపో సమీపంలో సౌకర్యవంతమైన పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ కోసం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా డీబీఎఫ్ఓటీ ఫ్రేమ్వర్క్పై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(PPP) ద్వారా ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆసక్తిగల పార్టీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 16న బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ను 3493 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడు బేస్మెంట్ స్థాయిల్లో మూడు అంతస్తుల్లో నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కాంప్లెక్స్లో దాదాపు 150 ఫోర్ వీలర్ వెహికిల్స్, టూ వీలర్ పెయిడ్ పార్కింగ్ స్థలాలు ఉంటాయి. అదనంగా బెస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్లలో హ్యాకర్ల కోసం వాణిజ్య స్థలాలు కేటాయించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలోని ఓల్డ్ సిటీ సమగ్ర అభివృద్ధికి ప్రాథమిక ఏజెన్సీగా పనిచేస్తున్న కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఈ ఎంఎల్పీ కాంప్లెక్స్ను పీపీపీ మోడల్లో నిర్మించాలని నిర్ణయించింది. దీంతో చార్మినార్ వద్ద పార్కింగ్ సమస్య తీరనుంది. అంతేగాక,ట్రాఫిక్ సమస్య కూడా కొంతమేర తీరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications