హైదరాబాద్లో ఘోరం : రెండో తరగతి విద్యార్థినిపై పీఈటీ లైంగిక దాడి
హైదరాబాద్ : ఈసీఐఎల్ పరిధిలోని ఎటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై 58ఏళ్ల చంద్రశేఖర్ అనే పీఈటీ(ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాధిత బాలిక కుటుంబ సభ్యులు.. చంద్రశేఖర్ కు దేహశుద్ది చేసి అతన్ని పోలీసులకు అప్పగించారు.
అంతకుముందు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక కుటుంబ సభ్యులు.. ఎటానమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. చంద్రశేఖర్ పై స్కూల్ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ధర్నాలో భాగంగా.. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున స్కూల్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
విషయం ఎలా తెలిసిందంటే..
పీఈటీ లైంగిక దాడితో.. గతకొద్ది రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పును గమనిస్తూ వస్తున్నారు తల్లిదండ్రులు. నిద్రలో కూడా 'సార్ నన్ను వదలండి' అంటూ బాలిక కలవరిస్తుంటే.. స్కూల్లో సార్ ను చూసి భయపడి ఉంటుందేమో అనుకున్నారు. ఇదే క్రమంలో బాలిక తీవ్రమైన అనారోగ్యానికి గురవడంతో.. తల్లిదండ్రుల్లో ఎక్కడో అనుమానం మొదలైంది.
దీంతో బాలికపై కాస్త ఒత్తిడి తెచ్చి అడగడంతో.. స్కూల్లో చంద్రశేఖర్ అనే పీఈటీ రెండు నెలలుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే విషయం చెప్పింది. బాలిక చెప్పిన వివరాల మేరకు స్ఠానిక పోలీస్ స్టేషన్ లో బాలిక తండ్రి కేసు నమోదు చేశారు. పిల్లల లైంగిక వేధింపుల సంరక్షణ చట్టం 'పోస్కో' కింద కేసు నమోదు చేసి చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, స్కూల్ యాజమాన్యం మాత్రం ఇంతవరకు ఈ ఘటనపై స్పందించకపోవడం గమనార్హం.
మరోవైపు ఏపీ బాలల హక్కు సంఘం నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన చంద్రశేఖర్ పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.