ఆఖరికి 'ఆక్సిజన్'నూ వదల్లేదు... బ్లాక్ దందా... హైదరాబాద్లో రెండు ముఠాలు అరెస్ట్...
కరోనా వైరస్ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడటంతో... కొంతమంది ముఠాగా ఏర్పడి కొత్త దందాకు తెరలేపారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించి ఒక్కో దాన్ని రూ.1లక్షకు విక్రయిస్తున్నారు. ఓవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే... ఇలా బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపడం గమనార్హం. తాజాగా హైదరాబాద్ వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠాల గుట్టు రట్టు చేశారు.

రెండు ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు...
ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్స్ విక్రయిస్తున్న ముఠాలపై వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ రెండు ముఠాలపై దాడులు చేసి దాదాపు 34 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పలు క్లినిక్స్,ఆస్పత్రులకు వీరు సిలిండర్లు విక్రయించినట్లు గుర్తించారు. అంతేకాదు,కొంతమందికి ఇళ్ల వద్దకే సిలిండర్స్ పంపించినట్లు గుర్తించారు.

ఒక్కో సిలిండర్ రూ.1లక్ష..
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆక్సిజన్కు భారీ డిమాండ్ ఏర్పడటంతో... ఈ ముఠాలు దాన్ని క్యాష్ చేసుకుంటున్నాయని పోలీసులు తెలిపారు. ఒక్కో సిలిండర్ను రూ.1లక్షకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.స్వాధీనం చేసుకున్న సిలిండర్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు అప్పగించామన్నారు. నగరంలో ఆక్సిజన్ సిలిండర్ల అమ్మకాలపై దృష్టి సారించామని.. అనుమతులు లేకుండా సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వ సీఎస్ హెచ్చరిక...
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కూడా ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ దందాను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.. సిలిండర్లను బ్లాక్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ సిలిండర్లను నిల్వచేసే ట్రేడర్లు 'పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్' నుంచి లైసెన్సు పొంది ఉండాలని చెప్పారు.సిలిండర్ల విక్రయాలపై తనిఖీ కోసం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ఫోర్స్, ప్రజారోగ్య శాఖ, ఎక్స్ప్లోజివ్స్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్లతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు.

సీఎస్ సూచనలు...
ఆక్సిజన్ సిలిండర్స్ విక్రయించే డీలర్స్.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది ఆ బృందాలు తనిఖీ చేయనున్నాయి. చర్యలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు సిఫారసు చేస్తాయి. కోవిడ్ 19 చికిత్స అందిస్తున్న ఆస్పత్రులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో సోమేష్ కుమార్ సూచించారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడితే క్రయోజెనిక్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు/వెస్సెల్స్ను ఆశ్రయించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications