లాక్ డౌన్ వేళ... హైదరాబాద్ జవహర్ నగర్లో 3 మృతదేహాలు.. ఏమై ఉంటుంది?
కరోనా లాక్ డౌన్ వేళ హైదరాబాద్లోని జవహర్ నగర్లో ఒకేచోట మూడు మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. డెంటల్ కాలేజీ సమీపంలోని మర్రిచెట్టుకు ఇద్దరు యువతుల మృతదేహాలు వేలాడుతూ కనిపించగా.. చెట్టు పక్కనే మరో చిన్నారి మృతదేహం కనిపించింది. యువతుల వయసు 20-22ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది.
Recommended Video
హత్యా.. ఆత్మహత్యా...
ఇద్దరు యువతుల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయని స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ మృతదేహాలను పరిశీలిస్తున్న సమయంలోనే చెట్టు పక్కన మరో చిన్నారి మృతదేహం ఉండటం చూసి షాక్ తిన్నారు. ఇది హత్యా.. ఆత్మహత్యా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎటువంటి మిస్సింగ్ కేసులు నమోదు కాకపోవడంతో ఈ ఘటన అనుమానాస్పదంగా మారింది.
పోస్టుమార్టమ్ రిపోర్ట్ వస్తేనే..
మర్రిచెట్టుకు దాదాపు 8 అడుగుల ఎత్తున యువతులు ఉరివేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్కు తరలించారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్లో ఇది హత్యా.. ఆత్మహత్యా.. అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వేరే ప్రదేశంలో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీశారా.. లేక వేరే ప్రాంతానికి చెందిన యువతులు ఇక్కడికొచ్చి ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఏమై ఉంటుంది..
ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. వీరు వేరే ప్రాంతం నుంచి వచ్చి నగరంలో చిక్కుకుపోయారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. వ్యక్తిగత,కుటుంబ కలహాలే ప్రాణం తీశాయా... లేక ఎవరైనా హత్య చేశారా అన్నది తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు బయటకొస్తేనే ఈ మిస్టరీ బయటపడే అవకాశం ఉంది. ఇందుకోసం పోలీసులు స్థానిక జవహర్ నగర్ కాలనీలోని సీసీటీవి ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కేసును చేధిస్తామని పోలీసులు ధీమాగా చెబుతున్నారు.