రూ.80 లక్షల చీటింగ్: కిలాడీ సాఫ్టువేర్ ఇంజినీర్ అరెస్ట్ (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్టుమెంట్ పోలీసులు శనివారం నాడు వివిధ చీటింగ్ కేసులలో 11 మందిని అరెస్టు చేశారు. అందులో 'సాఫ్టువేర్' మోసానికి పాల్పడుతున్న ప్రియాంక గుప్త, ఆర్ రావులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మానిటరింగ్ సర్వీస్లో కాంట్రాక్టులు ఇస్తామంటూ సాఫ్టువేర్ కంపెనీలను మోసం చేసిన నేరగాళ్లు ప్రియాంక గుప్తా, ఆర్ రావులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.
విశాఖపట్నంకు చెందిన ప్రియాంక, ఆగ్రా నివాసి తరుణ్ గుప్తాలు విశాఖలో ఆరేళ్ల క్రితం ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేసేవారు. కొద్దిరోజులయ్యాక వీరిద్దరూ పెళ్లిచేసుకుని ఢిల్లీ వెళ్లిపోయారు. ఢిల్లీలోని సాఫ్టువేర్ కంపెనీల్లో పని చేశారు. అయితే, ఆదాయం సరిపోక మోసాలు చేసేందుకు పథకం వేశారు.
సాఫ్టువేర్ కంపెనీల్లో ప్రాజెక్టులు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకునేవారు. గత ఏడాది అక్టోబర్లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ను ఉపయోగించుకోవాలని పథకం వేశారు. స్కిల్ డెవలప్మెంట్ మోనిటరింగ్ సర్వీస్ పేరుతో కంపెనీ ప్రారంభించారు.
యువతీ యువకులకు ఇంటర్నెట్ నైపుణ్యం నేర్పేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను తయారు చేయాలంటూ ప్రకటనలు ఇచ్చారు. ఒప్పందాల్లో పాల్గొనేవారు ఒక శాతం తిరిగి చెల్లించని ధరావతు పంపించాలని పేర్కొన్నారు. ఢిల్లీ, హర్యానా నుంచి కొన్ని సంస్థలు ఈఎండీ చెల్లించడంతో దేశమంతా మోసాన్ని విస్తరించాలనుకున్నారు.
ప్రియాంక గుప్తా విశాఖలో ఉంటున్న తన బావ ఆర్ రావుకు పథకం వివరించారు. వచ్చిన డబ్బులో వాటాలు పంచుకుందామంటూ చెప్పడంతో ఆర్ రావు ఒప్పుకున్నాడు. అనంతరం హైదరాబాద్కు చెందిన మూడు సాఫ్టువేర్ సంస్థలు టెండర్ను దాఖలు చేసి ఈఎండీగా రూ.16.2లక్షలు చెల్లించాయి.
గడువు పూర్తయినా టెండర్ వ్యవహారాలు చెప్పడం లేదంటూ ప్రియాంక గుప్తాను సంప్రదించగా... అప్పటికే ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అదే సమయంలో ఢిల్లీలోనూ బాధితులు ఫిర్యాదు చేయడంతో తరుణ్ గుప్తాను ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.
బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసు అధికారులు శుక్రవారం ఢిల్లీలో ఉన్న ప్రియాంక గుప్తా, ఆర్ రావులను అదుపులోకి తీసుకుని పీటీ వారెంట్ కింద హైదరాబాద్కు తీసుకొచ్చారు. వీరి ఖాతాల్లో ఉన్న రూ.40 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సెల్ ఫోన్లు, డెబిట్ కార్డులు, పాన్ కార్డులు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వీరు రూ.83లక్షలు స్వాహా చేశారని చెబుతున్నారు.