గచ్చిబౌలి గర్బిణీ హత్య కేసులో ట్విస్ట్: చంపింది మరిదే.. భర్త కూడా పథకంలో భాగమే?
Recommended Video

హైదరాబాద్: గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ సమీపంలో వెలుగుచూసిన గర్భిణి దారుణ హత్య ఉదంతం మరో మలుపు తిరిగింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమా? అన్న అనుమానం వ్యక్తమవుతునప్పటికీ.. కుటుంబ కలహాలు, ఆస్తుల గొడవలు కూడా ఇందుకు కారణం కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. చంపింది మరిదే కావడం.. హత్యకు మృతురాలి భర్త కూడా సహకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

బైక్ నంబర్ ఆధారంగా..:
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు వాడిన బైక్ నంబర్ గుర్తించిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని గుర్తించారు. ఏపీ 10ఏఎల్9947 అనే బైక్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు.
సికింద్రాబాద్ బౌద్దనగర్ ఆనంద్ కుటీర్ ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ గాడ్రే అనే వ్యక్తి ఈ బైక్ ను 2009లో శశికుమార్ అనే వ్యక్తికి అమ్మినట్టు గుర్తించారు. అతని నుంచి అమర్ కాంత్ వద్దకు బైక్ వచ్చినట్టు నిర్దారించారు. అమర్ కాంతే ఈ కేసులో ప్రధాన నిందితుడు అన్న అంచనాకు వచ్చారు.

సొంత వదినే..:
హత్యగావించబడ్డ మహిళ అమర్ కాంత్కు సొంత వదినే అని పోలీసులు గుర్తించారు. పథకం ప్రకారం ఆమె భర్త సురేష్ ఝా, అత్త, మరిది అమర్కాంత్ ఝా కలిసి ఆమెను హత్య చేసినట్టు గుర్తించారు. హత్యానంతరం అమర్కాంత్, అతని తల్లి జనవరి 29వ తేదీ తెల్లవారుజామున 3:27గం. సమయంలో శ్రీరాంనగర్ ప్రాంతంలోని ఓ దుకాణం ఎదుట మూటను పడేసి వెళ్లారు.

హత్య తర్వాత కదలికలు..:
మూటను శ్రీరాంనగర్ లోని షాపు ముందు పడేసిన తర్వాత కొండాపూర్ ఏరియా ఆసుపత్రి వద్ద నిందితులు అమర్ కాంత్, అతని తల్లి కొద్దిసేపు ఆగారు. అక్కడి నుంచి వెనక్కి వచ్చి బర్ఫీ స్వీట్ హౌజ్ వద్ద గల్లీలోకి వెళ్లి మళ్లీ కాసేపు ఆగారు.
అక్కడి నుంచి తిరిగి వెనక్కి వచ్చి మసీద్ బండ మీదుగా హెచ్సీయూ ప్రధాన రహదారికి చేరుకున్నారు. గచ్చిబౌలి స్టేడియం మీదుగా డీఎల్ఎఫ్ నుంచి జయభేరి లేఅవుట్ కు వెళ్లారు. అక్కడి నుంచి ఇక ఎటువెళ్లింది తెలియరాలేదు.

3నెలలుగా అద్దె ఇంట్లో:
అంజయ్య నగర్, సిద్దిఖీ నగర్ లలోనే నిందితుల ఇల్లు ఉంటుందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. దీని ప్రకారం దర్యాప్తు చేపట్టగా.. సిద్దిఖీ నగర్ లోని నిందితుల ఇంటిని ఎట్టకేలకు గుర్తించారు. స్థానికులు చెబుతున్నదాని ప్రకారం.. ఆ అద్దె ఇంట్లో అమర్ కాంత్ ఝా, అతని తల్లిదండ్రులు ఉంటున్నారు.
మూడు నెలల నుంచి ఆ ఇంట్లో వారు అద్దెకు ఉంటున్నారు. 10రోజుల క్రితం ఊరెళ్తున్నట్టు అక్కడివారితో చెప్పి అమర్ కాంత్ ఝా పరారయ్యాడు. అమర్ కాంత్ స్థానికంగా ఒక బార్లో వెయిటర్ గా పనిచేస్తున్నట్టు తెలిపారు.

స్టోన్ కటింగ్ యంత్రంతో చంపేశారా?..:
స్టోన్ కటింగ్ యంత్రంలో పడేసి ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శవాన్ని ముక్కలు ముక్కలు చేసిన తీరు చూస్తుంటే.. స్టోన్ కటింగ్ యంత్రంతోనే కాళ్లు, చేతులు కోసినట్టుగా వారు భావిస్తున్నారు. స్నేహితుడు వికాస్తో కలిసి అమర్ కాంత్ ఈ హత్య చేసినట్టు సమాచారం. వికాస్ స్థానికంగా ఓ పానీపురి బండి నడుపుతుంటాని గుర్తించారు.

హత్యకు కారణమేంటి?:
హత్య వెనుక వివాహేతర సంబంధమే కారణమా?.. లేక ఆస్తి గొడవలు.. కుటుంబ కలహాలు ఉన్నాయా?.. గర్భిణీ అని కూడా చూడకుండా అంత కిరాతకంగా ఎందుకు చంపారు? అన్న వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
హత్యానంతరం రిజిస్ట్రేషన్ పని ఉందని చెప్పి అమర్ కాంత్ బీహార్ పారిపోయినట్టు గుర్తించారు. ప్రస్తుతం నిందితుని తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications