చెన్నైలాంటి పరిస్థితే వస్తే హైదరాబాద్ నిలుస్తుందా?
హైదరాబాద్: తమిళనాడు రాజధాని చెన్నై దుస్థితి చూస్తుంటే నగర ప్రణాళికలోని అస్తవ్యస్థత, హేతురాహిత్యం అర్థమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తట్టుకునే శక్తి నగరాలకు లేకుండా పోతుందనే విషయాన్ని చెన్నై హెచ్చరిస్తోంది. చెన్నైలో లాంటి వరదలు, వర్షాలు వస్తే తెలంగాణ రాజధాని హైదరాబాదు నిలుస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నిజానికి, హైదరాబాద్ చాలా సురక్షితమైన నగరమే అయినప్పటికీ ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాల వల్ల, ప్రణాళికబద్ధమైన విస్తరణ లేకపోవడం వల్ల ప్రమాదకారిగానే పరిణమించే అవకాశాలున్నాయి. హైదరాబాద్ ఎంతగా సురక్షితమని భావించినప్పటికీ 2000 ఆగస్టులో 24 గంటల పాటు 22 సెంటిమీటర్ల వర్షం పడితే అతలాకుతలమైంది.
కొన్ని గంటల పాటు వర్షం పడితే రోడ్లు చెరువుల్లా మారడం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం హైదరాబాదుకు అనుభవంలో ఉందే. నల్లాలను రీమోడలింగ్ చేయాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని కిర్లో,్కర్ కమిటీ చేసిన సూచనలను వరుస ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోలేదు.

నగరం నల్లాల్లో 2,700కు పైగా అక్రమ ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. 2000 ఆగస్టులో కురిసిన వర్షపాతం నేపథ్యంలో కిర్లోస్కర్ కమిటీ విస్తృతమైన అధ్యయనం జరిపింది. హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల్లోని డ్రైనేజీ వ్యవస్థ భారీ వర్షాలు కురుస్తే తట్టుకోలేదని కమిటీ తేల్చింది. కేవలం గంట పాటు లేదా 12 మిల్లీమీటర్ల వర్షపాతానికి మాత్రమే తట్టుకునే విధంగా జంటనగరాల డ్రైనేజీ వ్యవస్థ రూపకల్పన జరిగింది.
నీటిని నిల్వ చేసే చెరువుల అదృశ్యం, డ్రైనేజీల్లో చెత్తనూ ఇతర వ్యర్థపదార్థాలను పడవేయడం, చెరువులను ఆక్రమించి కాలనీలను నిర్మించడం వంటి చర్యల వల్ల నగరంలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలకు, వరదలకు తట్టుకోలేని స్థితికి చేరుకుందని కమిటీ గుర్తించింది.
నాలాలు ఎంత లోతు, ఎంత విశాలం ఉండాలనే విషయంతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు భారీ వర్షాలకు తట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సులు చేసింది. ప్రభుత్వాలు అక్రమ కట్టడాలను క్రమబద్దీకరించే పనిలో పడ్జాయే గానీ వాటి వల్ల సంభవించే ముప్పును మాత్రం పట్టించుకోవడం లేదు.












Click it and Unblock the Notifications