హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం: రహదారులు జలమయం, ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. బీజేపీ బహిరంగ సభ జరిగిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో తేలికపాటి వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని బేగంబజార్, ఏంజే మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
కూకట్పల్లి, కేపీహెచ్బీ, హైదర్నగర్, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల్లో వర్షం పడింది.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న బీజేపీ విజయ సంకల్ప సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు వర్షం రాకతో కొంత అసౌకర్యానికి గురయ్యారు. సభా ప్రాంగణంలో రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాట్లు చేశారు. వర్షంతోపాటు భారీగా ఈదురుగాలు రావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రహదారులపై వరద నీరు పొంగిపొర్లడంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి రాజేంద్రనగర్, శంషాబాద్, కిస్మత్పురా, బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్, గండిపేట్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ఆదివారం జార్ఖండ్ దాని పరిసరాల్లో కొనసాగుతూ సగటు సముద్రమమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో జార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రం వైపు కిందిస్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయన్నారు. వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.