ఫేస్బుక్ పరిచయం: గచ్చిబౌలి టీచర్కు రూ. 18 లక్షల కుచ్చుటోపీ
హైదరాబాద్: గచ్చిబౌలిలో నివసించే ఒక టీచర్కు మాయమాటలు చెప్పి రూ. 18.11 లక్షలకు కుచ్చుటోపీ పెట్టిన నైజీరియన్ను, అతడికి సహకరించిన ముంబైకు చెందిన మరో వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ స్కూల్లో ఓ మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. మార్చి, 2015లో నైజీరియాకు చెందిన అనిజాన్ఇబుచి ఆమెకు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు.
తన పేరు కెల్విన్ వైనీ అని, యూకేలో జియాలిస్ట్గా పనిచేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే తనని ప్రేమిస్తున్నాని మెయిల్ పెట్టాడు. పెళ్లిచేసుకుంటానని కూడా చెప్పాడు. దీంతో మహిళా టీచర్ భారత్కు వచ్చి తన తండ్రితో మాట్లాడమని ఉపాధ్యాయురాలు అతడికి చెప్పింది.

మరో రెండు నెలల్లో ఇండియాకు వస్తున్నానని, అక్కడికి వచ్చిన తర్వాత ఖర్చుల నిమిత్తం 1.4 లక్షల జీబీ పౌండ్స్తోపాటు ల్యాప్టాప్, ఇతర వస్తువుల పార్సిల్ ద్వారా పంపుతున్నట్లు చెప్పాడు. ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత ముంబైకి చెందిన క్రిస్ కెన్నడీ అనే వ్యక్తి స్కైబర్డ్ ఎక్స్ప్రెస్ కొరియర్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఫోన్ చేశాడు.
యూకే నుంచి మీకు వచ్చిన పార్సిల్ను కస్టమ్స్ అదికారులు సీజ్ చేశారని టీచర్కు సమాచారం అందించాడు. అనంతరం ఇద్దరు వ్యక్తులు కస్టమ్స్ అధికారులమని చెప్పి పార్సిల్ అందాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు డబ్బులు కట్టాలని చెప్పి, ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా ఐదు దఫాలుగా ఆమె వద్ద నుంచి 18.11 లక్షలు వసూలు చేసినట్లు ఎస్సై మహ్మాద్ రియాజుద్దీన్ తెలిపారు.
ఇంకా కావాలని డబ్బు అడగటంతో ఆమెకు అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముంబై వెళ్లి అనిజాన్ఇబుచితో పాటు అతడి సహాయకుడు బిల్లాల్ఖాన్ అహ్మద్దేశ్ముఖ్ను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications