మళ్లీ కంటోన్మెంట్ రహదారులపై ఆంక్షలు: ఎటుపోవాలంటూ స్థానిక జనం ఆవేదన
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు మరోసారి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే.. కంటోన్మెంట్ ఏరియాలో 27 రోడ్లను మూసివేశారు ఆర్మీ అధికారులు. కొన్ని రోడ్లకు అడ్డుగోడలు కూడా కట్టేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోడ్లకు ఇనుప కంచెలు పెడుతున్నారు. ఆట స్థలాలపైనా ఆంక్షలు పెడుతున్నారని వాపోతున్నారు.
తాజాగా, నివాస ప్రాంతాలపైనా నిషేధాజ్ఞలు విధిస్తోందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ తమను ఇలా ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కాంటోన్మెంట్ వాసులు కోరుతున్నారు.
కంటోన్మెంట్ రోడ్లను బ్లాక్ చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. కంటోన్మెంట్ పరిధిలో కొన్ని సడలింపులు ఇవ్వాలని, అభివృద్ధి పనులకు అవకాశం కల్పించాలని కోరింది. రక్షణ శాఖ తమ అభ్యర్థనలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి చేసింది.
ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు, వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలని కోరుతోంది. అవకాశమున్న మార్గాలను తెరిచి ఉంచాలని కోరింది. అయితే, ఈ విషయంలో పలుమార్లు ఆర్మీ, రాష్ట్ర అధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది.