ప్రేమోన్మాది ఘాతుకం: ఇంటికెళ్లి లేడీ టెక్కీ గొంతుకోశాడు, బాధితురాలికి బండి సంజయ్ పరామర్శ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని హైదర్షాకోట్ లక్ష్మీనగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం లంగర్హౌస్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉంది.
హైదర్షాకోట్లోని ఓ సెలూన్లో పనిచేస్తున్న షారుక్సల్మాన్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో బాధిత యువతితో పరిచయం పెంచుకున్న షారుక్.. ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు.
మంగళవారం సాయంత్రం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన షారుక్.. ఆమెపై కూరగాయలు తరిగే కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన వాచ్మెన్ను నిందితుడు షారుక్ కత్తితో బెదిరించి పరారయ్యాడు. అయితే, స్థానికులు నిందితుడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ప్రేమ పేరుతో తమ కుమార్తెపై షారుక్ వేధిస్తున్నాడంటూ యువతి తండ్రి గతంలో షీ టీమ్స్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతితో షారుక్ సల్మాన్కు రెండేళ్ల నుంచి పరిచయం ఉందని డీసీపీ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.
కాగా, బాధిత యువతి గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రేమోన్మాది దాడిలో బాధితురాలి తల్లికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధిత యువతి పరిస్థితి కొంత నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువతిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.