అమానుషం : ఏడు రోజుల పసికందును రూ.3వేలకు విక్రయించిన కన్నతల్లి
హైదరాబాద్లో అమానుష ఘటన వెలుగుచూసింది. ముక్కుపచ్చలారని ఓ పసికందును కన్నతల్లే రూ.3వేలకు విక్రయించింది. ఆ తర్వాత తన బిడ్డను తనకు ఇచ్చేయాలని వారితో గొడవపడింది. అందుకు వారు నిరాకరించడంతో స్థానిక అంగన్వాడీ టీచర్ను ఆశ్రయించింది. ఆమె సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు శిశువును తల్లికి అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ మియాపూర్ సమీపంలోని బాచుపల్లిలో రాధ అనే మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. స్థానికంగా చిన్నపాటి గుడిసెను నిర్మించుకున్న దంపతులు అందులోనే ఉంటున్నారు. ఇదే క్రమంలో ఏడు రోజుల క్రితం రాధ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. విషయం తెలిసిన శాంతమ్మ అనే మహిళ రాధ వద్దకు వెళ్లి తమకు పిల్లలు లేరని శిశువును ఇవ్వాలని కోరింది.
శాంతమ్మ నుంచి రూ.3వేలు తీసుకున్న రాధ ఆమెకు శిశువును అప్పగించింది. అయితే ఆ మరుసటిరోజే తన బిడ్డను తనకు ఇవ్వాలని శాంతమ్మ ఇంటికి వెళ్లి గొడవ చేసింది. అందుకు శాంతమ్మ ససేమిరా అనడంతో ఏం చేయాలో తోచలేదు. స్థానిక అంగన్వాడీ టీచర్ను ఆశ్రయించి తన సమస్య గురించి చెప్పింది. ఆమె సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో.... పోలీసులు శాంతమ్మను పిలిపించి మాట్లాడారు. శాంతమ్మ నుంచి శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శిశువును తల్లి రాధకు అప్పగించినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఐదు రోజుల క్రితం వరంగల్ జిల్లా నర్సంపేటలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాములునాయక్ తండాకు చెందిన ఓ మహిళ(32) ఇటీవల మగ శిశువుకు జన్మనిచ్చింది. మూడో కాన్పులోనూ మగ శిశువే పుట్టడంతో హసన్ పర్తికి చెందిన శ్రీనివాస్ అనే దంపతులకు రూ.1లక్షకు శిశువును విక్రయించింది.విషయం స్థానిక అధికారులకు తెలియడంతో ఆ దంపతుల నుంచి శిశువును స్వాధీనం చేసుకుని తిరిగి తల్లికి అప్పగించారు. పోషించుకునే స్తోమత లేకనే శిశువును వారికి ఇచ్చామని శిశువు తల్లి అధికారులతో చెప్పింది.దత్తత తీసుకోవాలనే విషయం తెలియక తాము శిశువును కొనుక్కున్నామని శ్రీనివాస్ దంపతులు చెప్పారు.దత్తత కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మొదటి తప్పుకింద వారిని క్షమించి వదిలేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.