మోడీ ఫ్రెండే, నన్నంటే భస్మమే, ఒళ్లు దగ్గరపెట్టుకోండి: బీజేపీ, కాంగ్రెస్పై కేసీఆర్ నిప్పులు
హైదరాబాద్: తాను ప్రధాని నరేంద్ర మోడీని తులనాడే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. తాను తన ప్రసంగంలో మోడీ గారు అని మాత్రమే అన్నానని, గా.. అనలేదని చెప్పారు. ప్రధానిని అవమానించేలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
మోడీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని, తనకు ఆయనంటే ఎంతో గౌరవమని చెప్పారు. అంతేగాక, మోడీ తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని చెప్పారు. తాను అనదాన్ని అన్నట్లు అనుకుంటే మీ ఖర్మ అంటూ రాష్ట్ర బీజేపీ నేతలనుద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఒళ్లు దగ్గరపెట్టుకోండి..
జైలుకు వెళ్తావంటూ తనపై బీజేపీ నేతలు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని.. దేశంలో ఎవరు మాట్లాడినా జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుంటే మంచిదని కేసీఆర్ హెచ్చరించారు. అంతేగాక, ప్రధానిని విమర్శించకూడదని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అవసరమైతే ఎవరినైనా విమర్శించొచ్చు అని అన్నారు. తనను ముట్టుకుంటే భస్మమైపోతారని, టచ్ చేసి చూడాలని అన్నారు.
వెర్రికూతలు
తానెందుకు జైలు పోతానని వ్యాఖ్యానించిన కేసీఆర్.. తాను ప్రతీ ఏడాది పన్నులు చెల్లిస్తున్నానని,.. ఎలాంటి దుర్మార్గపు ఆస్తులు సంపాదించుకోలేదని చెప్పారు. తెలంగాణలో అద్భుత పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ ప్రధాని కూడా తనను పొగిడారని గుర్తు చేశారు. విద్యుత్ ను ప్రైవేటు సంస్థలకు కాకుండా బీహెచ్ఈఎల్కి ఇచ్చారని మోడీ ప్రశంసించారని చెప్పారు. కేసులకు భయపడుతున్నానని కొందరు వెర్రి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు.
సర్వేలు మా కోసమే..
సర్వేలు తమ కోసం చేసుకున్నామని.. ఉత్తమ్ కోసం కాదని కేసీఆర్ అన్నారు. రెండు సర్వేల్లో ఆరున్నర శాంపిల్స్ వచ్చాయని.. ఓ దాంట్లో 106 సీట్లు, మరో దాంట్లో 103 సీట్లు తమకు వస్తాయని సర్వేలో తేలిందని చెప్పారు. సన్యాసం తీసుకుంటా, గడ్డాలు పెంచుకుంటా అనేవి 40ఏళ్ల క్రితం రాజకీయాలని కేసీఆర్.. ఉత్తమ్ కు చురకలంటించారు.
తెలంగాణలో బీజేపీ పెద్ద జోక్
ఇక తెలంగాణపై దృష్టి సారిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారని.. ఇదో పెద్ద జోక్ అని.. రోజూ దృష్టి సారించుకోవచ్చని కేసీఆర్ అన్నారు. ప్రజలకు ఏం కావాలో తాము చేస్తున్నామని చెప్పారు. ప్రజలతో సామాన్య భాషలోనే మాట్లాడతానని.. ఎవరి కోసమే తాను మార్చుకోనని.. కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసలు బీజేపీ తెలంగాణలో ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేత లక్ష్మణ్ తామే ప్రత్యామ్నాయమంటూ జోకులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ ఉందని తాము గుర్తించడం లేదని అన్నారు.
ఫ్రస్టేషన్లలో బీజేపీ, కాంగ్రెస్
కాంగ్రెస్, బీజేపీ నేతలు ఫ్రస్ట్రేషన్లో తమపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని.. ప్రజలు మాత్రం సంతోషంగానే ఉన్నారని చెప్పారు. ప్రజలకు లబ్ధి చేకూరే అనేక పథకాలను అమలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 10 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని, బీజేపీకి ఉన్న సీట్లు కూడా రావని కేసీఆర్ జోస్యం చెప్పారు.
ఉత్తమ్ అప్పుడలా చేశావు..
రాజ్యసభ సీటు ఎవరికి కేటాయించాలనేది తమ పార్టీ అంతర్గత విషయమని కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాము శ్రీకాంతాచారి తల్లిని గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయిస్తే.. ఆమెపై ఉత్తమ్ తన సతీమణిని పోటీ చేయించి, కోట్లు ఖర్చు పెట్టి ఆమెను ఓడించారని ఆరోపించారు. అమరవీరుల కుటుంబసభ్యులకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ కోరిన నేపథ్యంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం పెత్తనం.. ఒక్క రూపాయి ఇవ్వలేదు
తెలంగాణకు కేంద్రం అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ.24వేల కోట్లు కావాలని అడిగితే 24రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రాలకు అప్పగించాలని కోరినా కేంద్రం స్పందించడం లేదని కేసీఆర్ అన్నారు. కేంద్రం తన పెత్తనాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదని అన్నారు. తెలంగాణకు కేటాయిస్తామన్న ఎయిమ్స్, ఐఐఎం, ఖాజీపేట రైల్వే కోచ్ పై కేంద్రాన్ని పార్లమెంటులో నిలదీస్తామని చెప్పారు.