ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం, కానీ, షరతు
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నికలు త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అనేక హామీలను ఇస్తోంది. సుమారు 2వేల కోట్ల పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల నేతుల, ప్రజల నుంచి విచిత్ర డిమాండ్లు వస్తున్నాయి.

ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజల డిమాండ్..
ఇప్పటికే పలు నియోవకర్గాలకు చెందిన ప్రజలు తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, అప్పుడే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం నిధులిస్తే తాము తమ పదవికి రాజీనామా చేస్తామని చెబుతున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేరారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ రాజా సింగ్
తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, దయచేసి తన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్యాకేజీ ప్రకటించాలని రాజా సింగ్ సీఎం కేసీఆర్ను కోరారు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుర్తుకు వస్తారని ఆయన విమర్శించారు. హుజూరాబాద్లో గెలవడానికి ప్యాకేజీలను ప్రకటించారన్నారు.

గోషామహల్కు మంచి ప్యాకేజీ ప్రకటించండి..
తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ప్యాకేజీలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారని రాజా సింగ్ చెప్పారు. గోషామహల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం మంచి ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ప్యాకేజీని ప్రకటించిన వెంటనే రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాజా సింగ్ స్పష్టం చేశారు.

ఇప్పటికే రాజీనామా చేస్తానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన
కాగా, ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయ తెలిసిందే. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 2వేల కోట్లు ఇస్తానని కేసీఆర్ సర్కారు ప్రకటిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. మరోవైపు, పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమ నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అంతేగాక, తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications