'సజీవంగా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాను'!ప్రధాని నోటివెంట ఇలాంటి మాటలా.?సిగ్గుచేటన్న పొన్నాల.!
హైదరాబాద్ : ఇటీవల ప్రధాని నరేంధ్ర మోదీ పంజాబ్ పర్యటన చేసిన వ్యాఖ్మలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. పంజాబ్ పర్యటన ముగిసిన తర్వాత మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్య అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని స్థాయిలో ఉన్నాడన్న అంశాన్ని మర్చిపోయిన మోదీ నియంత్రణ కోల్పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం చౌకబారు ఆరోపణలు గుప్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం ప్రధాని మోదీ ఎంతవరకైనా దిగజారుతాడు అనేందుకు మోదీ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ అని స్పష్టం చేసారు పొన్నాల.
పంజాబ్ పర్యటన.. మోదీ వాఖ్యలు బాద్యతారాహిత్యమన్న పొన్నాల
ప్రధానమంత్రి మోడీ పర్యటనలు, భద్రత, లోపాలు, ప్రజల ముందుకు వచ్చే విధానం ఆరోపణలపై వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఏ పార్టీ నుండి ప్రధాన మంత్రి పదవి చేపట్టినా దేశానికి ప్రధాన మంత్రే అవుతారని అన్నారు. భారతదేశం అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమని, 130 కోట్ల ప్రజలకి ప్రధానమంత్రి మోదీ అని అన్నారు. పంజాబ్ లో మోడీ పర్యటన సందర్భంగా రోడ్డు మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆందోళనకారులు ఉన్నారనే నెపంతో పర్యటనను రద్దు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు పొన్నాల.
సజీవంగా విమానాశ్రయానికి చేరుకున్నాను.. ఇలాంటి వాఖ్యలు మోదీ కి తగునా అని ప్రశ్నించిన పొన్నాల
అంతే కాకుండా తాను సజీవంగా విమానాశ్రయానికి చేరుకున్నానని ప్రధాని మోదీపంజాబ్ ముఖ్యమంత్రికి చెప్పడం తనకు చాలా విచారాన్ని కలిగించిందని అన్నారు. 20 నిమిషాలు ముందు రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నాను అని ప్రధాని మోదీ చెబితే 20 కిలోమీటర్ల మేర రైతులు ఉంటారా..? ఈ తొందరపాటు నిర్ణయం ఎస్పీజీ బాధ్యత కాదా. ఒకవైపు కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెబుతుంది. నివేదిక రాక ముందే ఆరోపణలా ? బిజెపి నాయకులు దేశమంతా ఆరోపణలు చేస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి ని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పొన్నాల మండిపడ్డారు.
మోదీ గతాన్ని నెమరువేసుకోవాలి.. మన్మోహన్ గుజరాత్ వచ్చినప్పుడు ఏం జరగిందో మోదీకి తెలుసన్న పొన్నాల
ప్రధాన మంత్రి భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లో లోపాలు రాకూడదు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పొన్నాల. ప్రధానమంత్రి మోదీ పర్యటనకు ప్రజలు రాకపోవడంతో అర్ధాంతరంగా పర్యటనను రద్దు చేసుకుని వెళ్ళిపోయారని అన్నారు. నిన్నగాక మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అతితక్కువ స్థానాల్లో గెలిచిందని, 2009లో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గుజరాత్ వచ్చినప్పుడు ఏం జరిగిందో మోదీకి తెలియదా అన్నారు పొన్నాల. మన్మోహన్ సింగ్ పబ్లిక్ మీటింగ్ లో ప్రజలు నిరసన తెలియజేశారు దానికి ముఖ్యమంత్రిగా ఆనాడు మీరు బాధ్యత వహించారా అని నిలదీసారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని పొన్నాల నిలదీసారు.
ఆనాడు మన్మోహన్ ని అడ్డుకున్నప్పుడు ఇలాగే స్పందించారా? మోదీ సమాధానం చెప్పాలన్న పొన్నాల
ప్రధానమంత్రి కార్యక్రమాలను రాజకీయం చేయడం అతి పెద్ద పొరపాటని, ఆనాడు ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నారని, మన్మోహన్ సింగ్ ఏమైనా అన్నారా.? ప్రధానమంత్రి మోడీ కాన్వాయ్ ను ఢిల్లీ , నోయిడాలో అడ్డుకో లేదా.? ఆరోజు ఏమైనా మాట్లాడారా..? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు సిగ్గుచేటు కాదా ? లక్నోలో ప్రధాని మోదీ బనారస్ యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు వేలాది మంది అడ్డుకో లేదా? ఆనాడు ఇప్పుడున్న యూపీ సీఎం ఆదిత్య నాధ్ దాస్ పక్కన లేడా? దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ప్రధాని అయితే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేసారు పొన్నాల లక్ష్మయ్య. ప్రధాని హోదాలో అనవసర ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించదని పొన్నాల హెచ్చరించారు.