కెసిఆర్ను చూడాలి: సమరయోధుడి కాంక్ష
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె చంద్రశేఖర్ రావును చూడాలని ఉందని స్వాతంత్ర్య సమరయోధుడు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గండమళ్ల నాగులు(104) అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వాడినే కానీ.. వృద్ధాప్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యానని అన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రాజేందర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
తన కోరికను వెల్లడించిన నాగులు తన లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు.

‘కేసీఆర్ గట్టి పిండం. మనిషి సన్ననైనా తూటాల్లాంటి మాటలు. ఉద్యమాన్ని ఒంటి చేత్తో ప్రపంచానికి చాటి చెప్పిండు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిండు. నా జీవితాన్ని కూడా తెలంగాణకు అంకితం చేశా. ఉద్యోగిగా ఉంటూనే ఉద్యమంలో పాల్గొన్నా. రజాకార్ల హయాంలో గుర్రపు డెక్కలతో దెబ్బలు తిన్నా. స్వాతంత్య్ర సమరంలో బ్రిటీషోళ్లకు బందీనయ్యా. తొలి తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్నా. చెన్నారెడ్డిని నమ్ముకొని ఉద్యమం చేశా' అని అన్నారు.
'మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు ఆనందమైంది. కాళ్లల్లో సత్తా ఉంటే రోడ్డెక్కేటోడినే. కానీ ఓపిక లేదాయె. మంచానికి పరిమితమయ్యా. రాష్ట్రం సాధించిపెట్టిన కేసీఆర్ను చూసి మురిసిపోతున్నా. శరీరమంతా చచ్చుబడింది. 104 ఏండ్లు బతికా. ఇగ బతకాలని లేదు. ఒక్కసారి సీఎం కేసీఆర్ను చూడాలనుంది' అని ఖమ్మం జిల్లా ఇల్లెందులోని 14 నెంబర్ బస్తీకి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు గండమళ్ల నాగులు (104) తెలిపారు.
ఆయన పెద్ద బాలశిక్ష చదివి స్వాతంత్య్ర సమరంలో 1944నుంచి 1948 వరకు ఎన్నోమార్లు జైలుకు వెళ్లారు. స్వతంత్ర భారతంలో ఆయన పోరాటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆర్అండ్బీ విభాగంలో గ్యాంగ్మెన్ ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఆయన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
తర్వాత వృద్ధాప్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. తెలంగాణ కల సాకారమండంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒక ఉద్యమకారుడు ముఖ్యమంత్రి కావడంతో కేసీఆర్ను చూడాలని ఆశగా ఉన్నారు. మూడు రోజుల కిందట మనుమడి సహాయంతో టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్కు ఓ లేఖ రాశారు. మంగళవారం దిండిగాల రాజేందర్.. నాగులును పరామర్శించారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి మీ కోరికను తీరుస్తానని నాగులుకు రాజేందర్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications