జాతీయ రాజకీయాలు మార్చేస్తా, మీ కథలొద్దు, జైలుకు పంపిస్తారా: కేసీఆర్ సంచలనం, మమత ఫోన్
Recommended Video
హైదరాబాద్: తాను థర్డ్ ఫ్రంట్ అని ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. తనకు దేశం నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. తనకు మహారాష్ట్ర నుంచి ఎంపీలు ఫోన్లు చేశారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయలేవని ప్రజలకు అర్థమైందన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఫోన్ చేశారని చెప్పారు. చైనా, సింగపూర్ అతి తక్కువ సమయంలో అభివృద్ధి చెందిందని చెప్పారు. అవసరమైతే ప్రజల కోసం రాజ్యాంగం మార్చాలని చెప్పారు. ఇప్పటికైనా రెండు జాతీయ పార్టీల్లో మార్పు రావాలని, తమ పంథాను, పద్దతిని మార్చుకోవాలన్నారు.
తాను భారత రాజకీయాలను మార్చేస్తానని కేసీఆర్ చెప్పారు. కేంద్రానికి పరిమిత అధికారాలు ఉంటాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ కూటమి ఉండాలన్నారు. ప్రసంగం తర్వాత ఆయన జై తెలంగాణ జై భారత్ అన్నారు. ఆయన నినాదం జై తెలంగాణ నుంచి జై భారత్కు మారింది.
విజయ్ మాల్యా వర్సెస్ నీరవ్ మోడీ
కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని కేసీఆర్ అన్నారు. మీ హయాంలో విజయ్ మాల్యా వెళ్లి పోయాడంటే, మీ హయాంలో నీరవ్ మోడీ వెళ్లిపోయాడని చెబుతుంటారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలతో ఆడుకున్నాయని చెప్పారు. ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు బంద్ కావాలన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు
ఆరోగ్యం, విద్యా విధానం, వ్యవసాయ విధానం, అర్బన్ డెవలప్మెంట్ తదితరాలను రాష్ట్రాలకు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు డబ్బులు ఢిల్లీ నుంచి రావాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయాల కోసం 130 కోట్ల ప్రజలను గోస పుచ్చుకుంటున్నాయని విమర్శించారు. 71 ఏళ్ల స్వతంత్ర భారతంలో పదేళ్లకు పైగా బీజేపీ, యాభై ఏళ్లకు పైగా కాంగ్రెస్ అధికారంలో ఉందని, కానీ చేసిందేమిటన్నారు.
డెబ్బై ఏళ్లుగా కథలు విన్నాం, మీ కంట్రోల్లో ఉండాలా
డెబ్బై ఏళ్లుగా కథలు విన్నామని, ఇంకా ఎన్నాళ్లు వినాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఎక్కడికి అక్కడ దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలకు కొన్ని వ్యవస్థలను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్మీ మీ కంట్రోల్లో ఉండాలని, జాతీయ రహదారులు మీ కంట్రోల్లో ఉండాలన్నారు. గ్రామ రోడ్లకు ప్రధానికి ఏం సంబంధమని ప్రశ్నించారు.
అమెరికాలో వలె సొంత రాజ్యాంగం
అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి జీడీపీ, సుప్రీం కోర్టులు ఉంటాయని కేసీఆర్ చెప్పారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగం ఉంటుందన్నారు. దేశం మొత్తం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ వైపు చూస్తోందన్నారు. చైనా అభివృద్ధిని చూసి అయినా మనం మారాలన్నారు. ఇంకా ఎన్ని రోజులు మన కథలు మారాలన్నారు. రిజర్వేషన్ల తీరు మారాలన్నారు. ఇప్పుడు ఓసీలలో ఉన్న వారు కూడా పేదరికంలో ఉండి బాధపడుతున్నారన్నారు.
తౌడు తీసి కుక్కల కొట్లాట
కృష్ణా నది వివాదంపై బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ వేసి 14 ఏళ్లయినా సమస్య కొలిక్కి రాలేదని కేసీఆర్ అన్నారు. ఊళ్లోని పంచాయతి మూడ్రోజులలో చెబుతారని, మంచినీళ్లు పంపేందుకు పద్నాలుగేళ్లు అవసరమా అని ప్రశ్నించారు. చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టాలని జాతీయ పార్టీలు చూస్తున్నాయన్నారు. కృష్ణా నీటిపై ఆంధ్రా, తెలంగాణ, కావేరీ నీటిపై కర్నాటక, తమిళనాడు కొట్టుకోవాలా అని మండిపడ్డారు.
ఢిల్లీలో కూర్చొని తమాషా చేస్తున్నారా
పెత్తనమంతా ఢిల్లీ ఉందని, అక్కడ కూర్చొని తమాషా చేస్తున్నారా అని కేసీఆర్ మండిపడ్డారు. అన్ని ధరలు పెరుగుతాయని, రైతులకు మాత్రం ధరలు పెరగయని విమర్శించారు. విద్యుత్ను ఓ వైపు నేపాల్కు అమ్ముకుంటారని, మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కొరత ఉంటుందని చెప్పారు. కేంద్రం ఏదీ తేల్చదని, ఏదీ తెగదన్నారు.
జైలుకు పంపిస్తామని బెదిరిస్తారా
ఇప్పుడు కూడా మాట్లాడితే జైలుకు పంపిస్తామని బెదిరిస్తారని కేసీఆర్ మండిపడ్డారు. నేను జైలుకు భయపడితే పద్నాలుగేళ్లు ఉద్యమాన్ని నడిపేవాడినా అని ప్రశ్నించారు. మీ పిట్ట బెదిరింపులు కేసీఆర్ పైన కాదన్నారు. కుంభకోణాలు, దగా చేసిన వాళ్లకు, అక్రమ సంపాదనపరులకు భయం ఉంటుందన్నారు. నేను నిటారుగా ఉన్నానని చెప్పారు. తనను ముట్టుకుంటే భస్మం అవుతారన్నారు. ఒకరు వేలుపెట్టి చూపించే పరిస్థితుల్లో తాను లేనని చెప్పారు. ఎవరైనా పద్ధతిగా మాట్లాడాలన్నారు.
మీ మద్దతు ఉంటే దేశానికి దశ దిశ చూపిస్తా
పది లక్షల కిలోమీటర్లు నడవాలన్నా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందని కేసీఆర్ చెప్పారు. మీ (టీఆర్ఎస్ ప్రజల) మద్దతు ఉంటే వంద శాతం భారత రాజకీయాలకు దశ, దిశ చూపించి దేశ ప్రజానీకానికి అద్భుత మార్గనిర్దేశనం చేస్తానని ఆయన చెప్పారు. రాజీవ్ గాంధీ సహా కాంగ్రెస్ ఎంతో చేస్తుందని భావించానని కానీ చేయలేదన్నారు. ఇప్పుడు మోడీ వస్తే చేస్తారని అనుకున్నానని కానీ చేయడం లేదన్నారు. ఈ దేశంలో ప్రబలమైన మార్పు రావాలన్నారు. తెలంగాణ నుంచి మార్పు ప్రారంభమైందన్నారు. వంద శాతం మనం విజయం సాధిస్తామన్నారు. రేపు బ్రహ్మాండంగా ఈ దేశం ముందుకు పోతుందని చెప్పారు. ఎవరిని కూడగట్టాలో వారిని కూడగడుతానని చెప్పారు. మమత తనను ఆశీర్వదించారని చెప్పారు. త్వరలో ఏకాభిప్రాయ నేతలం కలిసి మాట్లాడుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కథలు చెబుతూ ఢిల్లీలో కూర్చుంటే సరిపోతన్నారు. మార్పు తెలంగాణ నుంచి ప్రారంభమైందని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అవసరమయ్యేలా అవసరాలు తీరేలా ఉండాలన్నారు. అందరితో మాట్లాడుతానని చెప్పారు. తెలంగాణ నుంచి ప్రారంభమైందని, యావత్ భారతాన్ని చుడుతుందన్నారు. మేం మీ కంట్రోల్లో ఉండాలా అన్నారు.
నాకు వయస్సు కూడా సహకరించేలా లేదు కానీ
తాను థర్డ్ ఫ్రంట్ అని చెప్పగానే మమతా బెనర్జీ, శిబూ సోరెన్, మహారాష్ట్ర ఎంపీలు ఫోన్ చేశారని కేసీఆర్ చెప్పారు. తనకు 64 ఏళ్ల వయస్సు ఉందని, వయస్సు కూడా సహకరించేలా లేదని, ఇక్కడ (తెలంగాణ) కొత్తగా వచ్చిన రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయని, తనకు ఇక్కడే ఎంతో బిజీ ఉందని, ఇలాంటప్పుడు తనకు ఏం అవసరమని, కానీ బీజేపీ, కాంగ్రెస్లు మారాలన్నారు. తనకు ఉదయం నుంచి చాలా మంది ఫోన్లు చేసి థర్డ్ ఫ్రంట్ పైన అభినందనలు తెలిపారన్నారు. 2014లో కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేశామని చెప్పారు. జాతీయ పార్టీలు ఆడుకుంటున్నాయన్నారు. చైనా, సింగపూర్ వంటివి తక్కువ సమయంలో ఆర్థికంగా ఎదిగాయన్నారు.