తెలంగాణాకు కొత్త టెన్షన్.. క్యాన్సర్ కేసులపై ఐసీఎంఆర్ షాకింగ్ నివేదిక!
తెలంగాణ రాష్ట్రం విషయంలో ఐ సి ఎం ఆర్ ఆందోళనకరమైన ఒక రిపోర్ట్ ను ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని ఐ సి ఎం ఆర్ తాజా నివేదిక వెల్లడించింది. తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ 2026 పేరుతో విడుదలైన ఈ రిపోర్టు ప్రకారం ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో కొత్త రోగులు నమోదు అవుతున్నారని పేర్కొంది.
క్యాన్సర్ వ్యాప్తిపై ఐసీఎంఆర్ ఆందోళన
ఇంతగా క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంటే ముందస్తు స్క్రీనింగ్ పట్ల అవగాహన లేకుండా ప్రజలు ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. నివేదిక ప్రకారం 30నుంచి 49సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలలో కనీసం నాలుగు శాతం మంది కూడా క్యాన్సర్ పరీక్ష చేయించుకోవటం లేదని పేర్కొంది. రాష్ట్రంలో రొమ్ముక్యాన్సర్ స్క్రీనింగ్ రేటు 0.3% గా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు 3.3 శాతంగా, మహిళలను నోటి క్యాన్సర్ పరీక్షలు 2.5శాతంగా నమోదయ్యాయి.

2030 నాటికి భారీగా క్యాన్సర్ కేసులు
పురుషులలో అయితే నోటి క్యాన్సర్ పరీక్షలు కేవలం 2.6%గా మాత్రమే నమోదయింది. ఐ సి ఎం ఆర్ ఈ గణాంకాలను నిమ్స్ తో సహా 10 ఆసుపత్రుల నుండి సేకరించింది ఇక ఐ సి ఎం ఆర్ అంచనాల ప్రకారం 2026 చివరినాటికి తెలంగాణ రాష్ట్రంలో 46,762 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. 2030 నాటికి ఈ సంఖ్య సంవత్సరానికి 47,314 కు చేరవచ్చునని అంచనా వేస్తున్నారు.
ప్రధాన కారణం దీని వలనే
గత దశాబ్దంలో ఈ కేసుల సంఖ్య 30 శాతం పెరగగా, 2017లో 40 వేల 177 ఉన్న కేసులు 2024 నాటికి మొత్తం 52 వేల 334 కి చేరింది. ఇక మహిళలలో ప్రతి లక్షకు 183.8 మంది, పురుషులలో 149 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే మగవారిలో నమోదవుతున్న క్యాన్సర్లో పొగాకు వాడకం వల్ల వస్తున్న క్యాన్సర్ ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.
ఈ వ్యాధులతో బాధ పడేవారికి క్యాన్సర్ ముప్పు
ఇటు స్త్రీలలో కూడా పొగాకు వాడిన వారు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషులలో 58.8%, స్త్రీలలో 29.7 శాతం పొగాకు వాడకం వల్లే క్యాన్సర్లు వచ్చినట్టు నివేదిక పేర్కొంది.నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్లు తెలంగాణ రాష్ట్రంలో అధికంగా నమోదవుతున్నాయి. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు కూడా క్యాన్సర్ ముప్పును బాగా పెంచుతున్నాయి.
ప్రాధమిక దశలో గుర్తిస్తేనే క్యాన్సర్ నయం
అయితే క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేసే అవకాశం ఉంటుందని, ఆలస్యం చేసే కొద్దీ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుందని ఐ సి ఎం ఆర్ హెచ్చరిస్తుంది. కనుక క్యాన్సర్ పరీక్షలు పైన అవగాహన పెంచుకొని, ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచిస్తుంది.












Click it and Unblock the Notifications