ఓడిపోతే దాడిచేసి చంపుతారా ? టీఆర్ఎస్పై లక్ష్మణ్ ఫైర్
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని .. ఓడిపోయినంత మాత్రానా దాడులు చేయాలా అని మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా డోకూరులో బీజేపీ కార్యకర్తపై టీఆర్ఎస్ నేత కుమారుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మణ్ స్పందించారు.
హత్య రాజకీయాలు ?
ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో డోకూరులో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత కుమారుడు బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్పై దాడిచేశారు. దీంతో ప్రేమ్కుమార్ చనిపోయాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ హత్య రాజకీయాలు చేస్తుందని విమర్శించారు లక్ష్మణ్. గురువారం ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని లక్ష్మణ్ పరామర్శించారు. కుటుంబాన్ని అండగా ఉంటామని భరోసానిచ్చారు.

దాడులతో భయభ్రాంతులు ..
మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా మహదేవునిపేటలో కూడా ఎంపీటీసీ అభ్యర్థి వరలక్ష్మిని కూడా పరామర్శించారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరలక్ష్మికి ధైర్యం కల్పించారు. వీరిద్దరిపై జరిగిన దాడులను స్థానిక నేతలు లక్ష్మణ్కు వివరించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. బీజేపీ నేతలపై దాడుల చేసినా .. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు లక్ష్మణ్. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు కనిపించింది. జెడ్పీ పీఠాలను, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. అయితే కొన్నిచోట్ల బీజేపీపై జరిగిన దాడులు వెలుగులోకి రావడంతో ... ఆ పార్టీ విజయంపై అనుమానం కలిగిస్తోంది. నిజంగా కారు హవా కొనసాగిందా ? లేదంటే కొన్నిచోట్ల ఆ పార్టీ నేతలు ప్రభావం చూపించారా అనే సందేహాలను బీజేపీ నేతలు లేవనెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications