సీఎం కావాలని కేటీఆర్ కు సోకుంటే ఇప్పుడే అవకాశం .. భవిష్యత్ లో కష్టం అంటున్న బీజేపీ
రానున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ సత్తా చూపబోతుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కసరత్తు ప్రారంభించిందా అంటే అవును అనే అనే చెప్తున్నారు తెలంగాణా బీజేపీ నాయకులు . లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన నాటి నుండి ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వెయ్యాలని భావిస్తుంది. అంతే కాదు తెలంగానావు టీఆర్ఎస్ ను భవిష్యత్ లో లేకుండా చేస్తామని బల్ల గుడ్డి మరీ చెప్తుంది బీజేపీ .
కేంద్రంలో బీజేపీ .. తెలంగాణా రాష్ట్రంలోపట్టు కోసం వ్యూహం
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు స్థానాలు గెలిచి సత్తా చాటింది. ఇక దీంతో బీజేపీలో కొత్త ఊపు వచ్చింది. పార్టీని బలోపేతం చేస్తే భవిష్యత్ లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామనే ఆశలు చిగురించటంతో బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణా రాష్ట్రంపై దృష్టి సారించింది . అంతే కాక ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చి బీజేపీ తెలంగాణా పట్ల ఉన్న తన సానుకూల దృక్పధాన్ని చాటుకుంది . ఇప్పటికే కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న బీజేపీ ఇప్పుడు రాష్ట్రాలపైన దృష్టి పెట్టింది. ముఖ్యంగా తెలంగాణాపై దృష్టి పెట్టిన బీజేపీ టార్గెట్ టీఆర్ఎస్ అంటోంది. ఇక అందులో భాగంగా టీఆర్ఎస్ నాయకులపై , పార్టీ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
కేటీఆర్ కు ఆఫర్ ఇచ్చిన బీజేపీ నేతలు.. ఆ కోరిక ఇప్పుడే తీర్చుకో అంటూ సూచన
తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్కు బీజేపీ నేతలు ఓ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుంది అని చెప్పిన నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ కు సోకుగా ఉంటే ఇప్పుడే ఆ పదవి తీసుకోవాలని సూచించారు. లేదంటే భవిష్యత్ లో కష్టం అని తమ అభిప్రాయం వెల్లడించారు బీజేపీ ఎంపీలు . బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ను సీఎం చేయడానికే కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ కడుతున్నారని ఆరోపించారు. కానీ అది పూర్తయ్యేసరికి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. అందుకే ఇప్పుడే సీఎం కావాలన్న కోరిక ఉంటె తీర్చుకోవాలని సూచించారు.
భవిష్యత్తులో సీఎం కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయ్యేలా చేస్తామంటున్న బీజేపీ నేతలు
తెలంగాణలో బీజేపీ హవా మొదలైందని పేర్కొన్న బీజేపీ ఎంపీలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ వంద సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు . ప్రజాసమస్యలు పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ ఫాం హౌస్కే పరిమితం అవుతున్నారని ఆరోపణలు గుప్పించారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయ్యేలా , అక్కడే ఉండేలా బీజేపీ చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి భారీగా నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారు వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి బీజేపీ నేతలు టీఆర్ ఎస్ టార్గెట్ గా వరుసగామాతల తూటాలు పేలుస్తుంది .