కట్టడాలు కూల్చేసి, బోర్డులు పెట్టేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై మరోసారి ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్దంగా, ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించుకుని చేపట్టిన అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలపై రెండు నెలల క్రితం ఉక్కుపాదం మోపిన తెలంగాణ ప్రభుత్వం ఇపుడు షేక్పేటలో అన్యాక్రాంతమైన సర్కారు భూములపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగా సోమవారం ప్రభుత్వ భూముల్లో వెలసిన పలు నిర్మాణాలను సీజ్ చేయటంతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో తెలంగాణ సర్కారుకు చెందిన భూమి అంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్న పలు భవనాలకు అతి సమీపంలో బోర్డులను ఏర్పాటు చేసింది.
అక్రమ నిర్మాణాలు, ఆపై సర్కారు భూముల అన్యాక్రాంతాన్ని గుర్తించటంలో ప్రాథమిక దశను అధిగమించిన అధికారులు పరిసర ప్రాంతాల్లో మరిన్ని ప్రభుత్వ భూములను గుర్తించే అవకాశమున్నట్లు తెలిసింది. సికింద్రాబాదులోని తిర్మలగిరి మండలంలో కూడా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇక్కడ అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కాస్తా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అక్రమ కట్టడాల కూల్చివేత
సికింద్రాబాదులోని తిర్మల్గిరి మండలంలో అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతకు పూనుకున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత జిహెచ్ఎంసి పరిధిలో కొనసాగుతోంది.
రామకృష్ణతో గొడవ
అక్రమ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో స్థానికులు కొంత మంది తిర్మల్గిరి ఎమ్మార్వో రామకృష్ణతో గొడవకు దిగారు.
పోలీసు బందోబస్తు
అక్రమ కట్టడాల కూల్చివేతను అధికారులు పోలీసుల సహకారంతో చేపట్టారు. తిర్మల్గిరిలో కూల్చివేతలకు కార్ఖానా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కూల్చేసి బోర్డులు పెట్టేశారు..
అక్రమ కట్టడాలను కూల్చేసి, ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నంలో ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందిందంటూ బోర్డులు తగిలించారు.