Telangana Climate: వాతావరణ శాఖ హెచ్చరిక... రాగల 3 రోజుల్లో ఉరుములు,ఈదురు గాలులతో కూడిన వర్షం
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో(12,13,14) ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శనివారం(జూన్ 12) ఒకటి,రెండు ప్రాంతాల్లో... ముఖ్యంగా ఉత్తర,తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం(జూన్ 13) కూడా అతి భారీ వర్ష సూచన ఉందని... ఒకటి,రెండు చోట్ల భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడీనంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
IMD Report: ఈసారి మే నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం... 121 ఏళ్లలో ఇదే రెండో అత్యధికం...
శుక్రవారం(జూన్ 11) ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగళా ఖాతం,పశ్చిమ బెంగాల్,ఒడిశా ప్రాంతాల్లో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా... మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనము వ్యాపించినట్లు పేర్కొంది. రాగల 2 నుండి 3 రోజులలో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్,ఉత్తర ఛత్తీగఢ్ మీదగా వెళ్ళే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుండి దక్షిణ ఛత్తీస్గఢ్, విధర్బా, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా అరేబియా సముద్రం వరకు 3.1 నుండి 5.8 కిమి ఎత్తు వరకు ఏర్పడినట్లు తెలిపింది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల కారణంగా వరదలు కూడా రావొచ్చని అంచనా వేస్తున్నారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ నెల ప్రారంభంలో నైరుతి రుతు పవనాలు మొదట కేరళ తీరాన్ని తాకాయి. జూన్ 1వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేయగా... రెండు రోజులు ఆలస్యంగా వచ్చాయి. నైరుతి రుతు పవనాల ఆగమనం మొదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలపై ఆ ప్రభావం పడింది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది జూన్,జులై,అగస్టు,సెప్టెంబర్ మాసాల్లో దేశవ్యాప్తంగా సాధారణం,సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత రెండేళ్లుగా దేశంలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే నమోదవుతోంది.