Telangana Weather : తెలంగాణలో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్
తెలంగాణలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. రానున్న 48 గంటల్లో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వీటిలో మంచిర్యాల,జగిత్యాల,పెద్దపల్లి,కరీంనగర్,రాజన్నసిరిసిల్ల,జనగాం,సిద్దిపేట,మహబూబాబాద్,నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. కుమ్రం ఆసిఫాబాద్,నిర్మల్,ఖమ్మం,వరంగల్,యాదాద్రి భువనగిరి,నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
జయశంకర్ భూపాలపల్లి,సంగారెడ్డి,మెదక్ జిల్లాలకు రానున్న 48 గంటలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఉందని తెలిపింది.వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర,దక్షిణ ఒడిశా తీరంలో, నిన్న ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి మీ ఎత్తు వరకు వ్యాపించిందని.. అది ఎత్తుకు వెళ్తున్న కొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.
గత 24 గంటలుగా తెలంగాణపై నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్,భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు నమోదైనట్లు పేర్కొంది. సిర్పూర్లో 11సెం.మీ,ఇల్లందులో 7సెం.మీ,మిగతా ప్రదేశాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు నమోదైనట్లు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 29.6డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత,23.3 కనిష్ఠం ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.
అత్యధికంగా ఆదిలాబాద్లో32.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, అత్యల్పంగా దుండిగల్లో 19.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. రాష్ట్రంలో జూన్ 1,2021 నుంచి 29 ఆగస్టు వరకు 24శాతం వర్షపాతం అధికంగా నమోదైనట్లు తెలిపింది. అసలు వర్షపాతం 711మి.మీ కాగా... సాధారణ వర్షపాతం 574మి.మీ వర్షపాతంగా నమోదైంది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుంచి 32 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుంచి 25 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.