Rains in Telangana : నేడు తెలంగాణలో పలుచోట్ల భారీ వర్ష సూచన-మరో 3 రోజులు వర్షాలే
తెలంగాణలో ఆదివారం(సెప్టెంబర్ 5) నుంచి మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల్లోని ఒకటి రెండుచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. సోమవారం, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

అల్పపీడన ప్రభావంతో వర్షాలు...
తూర్పుమధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టానికి 4.5 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి బుధవారం వరకు చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

హైదరాబాద్లో పలు ప్రాంతాలు జలమయం...
హైదరాబాద్లో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్,ఆర్టీసీ క్రాస్ రోడ్,అంబర్పేట్,రామాంతపూర్,బేగంపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, చంపాపేట్, చాంద్రాయణగుట్ట, మోహిదీపట్నం, అత్తాపూర్, బంజారాహిల్స్తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అంబర్పేట-మూసారంబాగ్ మార్గంలో ఉన్న వంతెనపై నుంచి మూసీ వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరివాహాక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లపై విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం తలెత్తింది.భారీ వర్షానికి డ్రైనేజీ వరద పొంగి పొర్లుతుండటంతో పలు ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రోడ్ల పైకి మోకాళ్ల లోతు వరకు వరద నీరు చేరింది.

హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్లకు భారీ వరద
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు భారీగా వరద పోటెత్తుతోంది.దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1761.75 అడుగులుగా ఉంది. ఇక్కడ మొత్తం 17 గేట్లు ఉండగా 2 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790.00 అడుగులు కాగా..ప్రస్తుతం 1789.00 అడుగుల నీటి నిల్వ ఉంది. మొత్తం గేట్ల సంఖ్య 15 కాగా 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. 28 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications