మూడు రోజులు వర్షాలు.. వరుణ సందేశం ఇచ్చిన వాతావరణ శాఖ!
తెలంగాణా రాష్ట్రంలో ఒక పక్క ఎండలు దంచి కొడుతున్న వేళ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో ఇటీవల వాతావరణం ఎవరికీ అర్ధం కాకుండా మారింది. ఎండలు, వర్షాలతో కూడిన వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది ఎండల ధాటికి ఇబ్బంది పడుతున్న వారికి ఈ వర్షాలు ఉపశమనం కాగా, రైతులు వర్షాల దెబ్బకు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన
ఒకపక్క ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇంకోవైపు వర్షాలు కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన ప్రకారం, తెలంగాణలో నేడు మంగళవారం నుంచి ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఈ మూడు రోజులు ఆయా జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ జిల్లాలలో వర్షాలు.. జాగ్రత్త
ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ జల్లులతో పాటు ఈదురు గాలులు, వడగళ్లు కూడా పడతాయని అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేప్పుడు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
ఏప్రిల్ 10వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎండలు
రైతులు, ప్రయాణీకులు సైతం ప్రస్తుత వాతావరణ పరిస్థితులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. మూడు రోజుల పాటు వర్షాలు ముగిశాక తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎండలు ముదురుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రతలకు మించి 2 నుండి 3 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మార్పుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications