యాస్ తుపాను ప్రభావం.!తెలంగాణలో మోస్తరు వర్షాలు.!అప్రమత్తమైన ఉత్తరాంధ్ర.!
హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను తీవ్ర తుపానుగా మారింది. తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతూ పారాదీప్ కు ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో అత్యంత తీవ్ర తుపానుగా ఇది అవతరించనుందని వాతావరణ వాఖ స్పష్టం చేస్తోంది. బుదవారం తెల్లవారుజామున పశ్చిమబెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలైన చాంద్ బలి, ధర్మా పోర్ట్ ల మధ్య ఇది తీరాన్ని తాకనుంది. ఈరోజు విషయానికి వస్తే వాయవ్య, ఉత్తర దిశల నుంచి తక్కువ స్థాయి గాలులు తెలంగాణ మీదకు వస్తున్నాయి. అయితే, రాగల మూడు రోజుల పాటు యాస్ తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా యాస్ తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కలెక్టర్లు అప్రమత్తం చేసారు. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు కలెక్టర్లు. వాతావరణ శాఖ నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్లు ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నారు. అధికారులతో పాటు ఈ మూడు జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆక్సిజన్ తయారీ ప్లాంట్లకు, సిలెండర్ ఫిల్లింగ్ ప్లాంట్లకు కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడి కలెక్టర్లు వెల్లడించారు. జిల్లాల్లో కోవిడ్రోగులకు సేవలు అందిస్తున్న సుమారు 80కి పైగా ఆస్పత్రుల్లో అన్నిరకాలుగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకున్నామని మూడు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.